నాలుగు రోజులైనా.. బోరుబావిలోనే: వెలికి తీతలో విఫలం: పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి
Recommended Video
చెన్నై: తమిళనాడును విషాదంలో ముంచెత్తిన రెండేళ్ల బాలుడు సుజిత్ విల్సన్ ఉదంతం కొనసాగుతూనే వస్తోంది. 60 గంటలు దాటిపోయినప్పటికీ.. బోరుబావిలో పడ్డ సుజిత్ ను వెలికితీయలేకపోతున్నారు. శుక్రవారం సాయంత్రం బోరుబావిలో పడిన వెంటనే ఆరంభమైన సహాయక చర్యలు.. సోమవారం తెల్లవారు జాము వరకూ కొలిక్కి రాలేదు. బోరుబావిలో బాలుడు చిక్కుకున్న చోటికి చేరుకోలేకపోతున్నారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వే క్రమంలో భూమి కదిలిపోవడం వల్ల మరింత లోతుకు దిగజారిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
పవన్ కల్యాణ్, నారా లోకేష్ లకు గోల్డెన్ ఛాన్స్: అందుకుంటారా? వదులుకుంటారా?
శుక్రవారం సాయంత్రం నుంచి.. బోరుబావిలో..
శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో తన తండ్రికి చెందిన మొక్క జొన్న పొలంలో ఆడుకుంటూ దురదృష్టవశావత్తూ సుజిత్ బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా మనప్పారై సమీపంలోని నడుకట్టుపట్టిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్యరాజ్, కళైరాణిల రెండో కుమారుడు సుజిత్ విల్సన్. ఆరోగ్యరాజ్ కు నాలుగెకరాల పొలం ఉంది. అందులో మొక్కజొన్నను పండిస్తున్నాడు. నీరు పడకపోవడంతో ఖాళీగా వదిలేసిన బోరుబావిలో సుజిత్ పడిపోయాడు. ఆ బోరుబావి లోతు సుమారు వంద అడుగుల పైమాటే. ప్రారంభంలో 25 అడుగుల లోతులో సుజిత్ చిక్కుకుని ఉన్నట్లు గుర్తించారు. అనంతరం 90 అడుగుల కిందికి చేరుకున్నాడు.
సంఘటనా స్థలానికి పన్నీర్ సెల్వం..
సంఘటన చోటు చేసుకున్న నడికట్టుపట్టి గ్రామానికి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం చేరుకున్నారు. వెలికితీత పనులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఓపీఎస్ తో పాటు కొందరు మంత్రులు, రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు నడికట్టుపట్టికి చేరుకున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ బాలుడు ప్రాణాలతో బయటికి వస్తాడనే ఆశలు నీరుగారుతున్నాయి. మరోవంక- చమురు సహజవాయువుల సంస్థ (ఓఎన్జీసీ) అధికారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భారీ యంత్రాలను తీసుకొచ్చి, బోరుబావికి సమాంతరంగా రంధ్రాన్ని చేసే పనిలో నిమగ్నమయ్యారు.
నిర్విరామంగా శ్రమిస్తున్నా..
సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఆదివారం తెల్లవారు జామున బోర్ వెల్స్ యంత్రాలను తెప్పించారు. వాటి సహాయంతో బోరుబావికి సమాంతరంగా రంధ్రాన్ని వేస్తున్నారు. బోరు వేసే చర్యల వల్ల భూమి కదిలి పోవడంతో సుజిత్.. మరింత లోతుకు దిగజారినట్లు నిర్ధారించారు. సమీప ఆసుపత్రుల నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించారు. నిరంతరాయంగా ఆక్సిజన్ ను బోరుబావిలోకి పంపిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి బాలుడి నుంచి కదలికలు లేవనే విషయం వారిని కలిచి వేస్తోంది.
విషాదంలో సుజిత్ కుటుంబం..
ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకోవడంతో సుజిత్ తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. విషాదంలో మునిగిపోయారు. తమ కుమారుడు ప్రాణాలతో జీవించి ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు. జాతీయ వైపరీత్యాల నిర్వహణ బలగాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు, స్థానిక అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం నిర్విరామంగా శ్రమిస్తున్నప్పటికీ.. చిన్నారి సుజిత్ ను అందుకోలేకపోతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఈ ఘటన పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. సుజిత్ ప్రాణాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తున్నారు.