దిగ్విజయ్ దుకాణం బందేనా?డిగ్గిరాజాను దూరం పెడుతున్న కాంగ్రెస్ హైకమాండ్
ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆయన. సోనియా, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. కానీ ఇప్పుడాయనకు బ్యాడ్ టైం నడుస్తోంది. పార్టీ పెద్దలే కాదు.. చిన్నా చితకా నాయకులు కూడా పట్టించుకోవడం మానేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా తేలలేదు. అసలు అవకాశం ఇస్తారో లేదో కూడా తెలియదు. రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు దిగ్విజయ్ సింగ్. తాజా పరిణామాలను గమనిస్తే దిగ్విజయ్ సింగ్ దుకాణం ఇక బంద్ అయినట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల స్టంటే : ఆ ఘనత మీది కాదు ..? టెలిగ్రాఫ్ రిపోర్టర్దేనన్న విపక్షాలు
2017 నుంచి బ్యాడ్ టైం
రెండేళ్ల క్రితం వరకు దిగ్విజయ్ పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ గా పాల్గొనేవారు. 2017 గోవా అసెంబ్లీ ఎన్నికలతో ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కేవలం 13 సీట్లు గెలుచుకున్న బీజేపీ, చిన్న పార్టీల సాయంతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దిగ్విజయ్ అలసత్వం కారణంగానే ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ గోవాలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాలేదని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం కోసం వేచి చూడాలన్న ఆయన నిర్ణయం కారణంగానే అవకాశం కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు బీజేపీ సైతం తమకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ అంటూ సటైర్లు విసరడం దిగ్విజయ్ కు మరింత ప్రతికూలంగా మారింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తన తప్పేమీ లేదని, ధన బలంతో బీజేపీ చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లను కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చిందని దిగ్విజయ్ ఎంత మొత్తుకున్నా పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు.
గోవా ఎఫెక్ట్ తో పదవులు దూరం
గోవా అసెంబ్లీ ఎన్నికల తదుపరి పరిణామాల నేపథ్యంలో అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీ దిగ్విజయ్ సింగ్ ను గోవా, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను ఇంఛార్జ్ బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. మధ్య ప్రదేశ్ అసెంబ్లీ న్నికలపై దృష్టి సారించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించినప్పటికీ.. ఆ తర్వాత ఆయనకు ఎలాంటి కీలక బాధ్యతలు అప్పగించలేదు. కమల్ నాథ్, జ్యోతిరాధిత్య సింథియాలు అన్నీ తామై అంతా తామై వ్యవహరించడంతో దిగ్విజయ్ కు ప్రాధాన్యత లేకుండా పోయింది.
కమల్ నాథ్ వర్సెస్ దిగ్విజయ్
దిగ్విజయ్ కు రాజకీయంగా చెక్ పెట్టేందుకు ఆయన విరోధులు కమల్ నాథ్ ను ఉపయోగిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే గత 30-35 ఏళ్లలో కాంగ్రెస్ ఎన్నడూ విజయం సాధించని లోక్ సభ స్థానం నుంచి దిగ్విజయ్ ను పోటీ చేయమని కమల్ నాధ్ కోరారని అంటున్నారు. దిగ్విజయ్ ను వ్యతిరేకించే జ్యోతిరాదిత్య సింధియా సైతం కమల్ నాథ్ ప్రతిపాదనను సమర్థించడం ఈ వాదనలు బలం చేకూరుస్తున్నాయి. ఇదే జరిగి ఒకవేళ దిగ్విజయ్ ఓటమి పాలైతే ఇక ఆయన రాజకీయ భవితవ్యం అగమ్య గోచరమే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
రాహుల్ చేతిలో దిగ్విజయ్ భవితవ్యం
కాంగ్రెస్ ఎన్నడూ గెలవని స్థానం నుంచి దిగ్విజయ్ పోటీ చేయాలన్న కమల్ నాథ్ ప్రతిపాదనపై దిగ్విజయ్ సింగ్ స్పందించారు. పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీ చేసేందుకైనా సిద్ధమని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. రాహుల్ నిర్ణయం శిరసావహిస్తానని చెప్పినా.. డిగ్గి రాజాకు మాత్రం తనకు గట్టి పట్టున్న రాజ్గఢ్ స్థానం నుంచి పోటీ చేయాలని ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద రాజకీయంగా డల్ అయిపోయిన దిగ్విజయ్ సింగ్ కు కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మళ్లీ ఛాన్స్ ఇస్తారా? లేక డిగ్గిరాజా మీ సేవలు ఇక చాలని సాగనంపుతారా? అనే ప్రశ్నకు తొందరలోనే సమాధానం దొరకనుంది.