ఆశలున్నాయి, 14రోజులపాటు ప్రయత్నాలు: చంద్రయాన్ 2పై ఇస్రో ఛైర్మన్, మోడీ తీరుపై ఇలా..
సంకేతాలు తెగిపోయినప్పటికీ చంద్రుడిపైకి పంపిన విక్రమ్ ల్యాండర్పై ఆశలు పూర్తిగా కోల్పోలేదని, ల్యాండర్ ఆచూకీ కనుగొనే విషయంలో తమ ప్రయత్నాలను విరమించలేదని ఇస్రో ఛైర్మన్ కే శివన్ వ్యాఖ్యానించారు. చంద్రయాన్ 2 స్పేస్క్రాఫ్ట్తో సంబంధాలు ఏర్పర్చుకోవడానికి 14 రోజులపాటు తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని తెలిపారు.
చివరి నిమిషంలోనే..
యాత్ర చివర్లో నిర్వహించిన ‘పవర్ డిసెంట్' పక్రియలో నాలుగు దశలున్నాయి. మొదటి మూడు దశలు అనుకున్నట్లుగానే కొనసాగాయి. చివరిది కూడా సాఫీగా సాగుతుందనే అనుకున్నాం.. కానీ అలా జరగలేదు. అందువల్లే ల్యాండర్తో సంబంధాలు తెగిపోయాయని శివన్ శనివారం మీడియాకు తెలిపారు.
చంద్రయాన్ 2 ప్రభావం ఉండదు..
2022లో చేపట్టబోయే భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ సహా సంస్థ తలపెట్టిన ఏ కార్యక్రమంపైనా దీని ప్రభావం ఉండబోదన్నారు. ల్యాండర్, రోవర్లను సాంకేతిక సత్తాను ప్రదర్శించేందుకు మాత్రమే ప్రయోగించినట్లు వివరించారు. అయితే, చంద్రయాన్ 2లో చివరి దశలో కొంత తప్పుడు నిర్వహణ వల్లే ఈ ప్రయోగం నిరాశ పర్చిందని శివన్ అభిప్రాయపడ్డారు. ల్యాండర్ డేటాను అనలైజ్ చేశామని అన్నారు.
మోడీ వ్యాఖ్యలతో నూతనోత్తేజం
తనతోపాటు శాస్త్రవేత్తలంతా నిరాశలో కూరుకుపోయిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ తమను ఓదార్చడంతోపాటు నూతనోత్తేజాన్ని కలిగించేందుకు ప్రయత్నించారని శివన్ చెప్పారు. ఫలితం ఎలాగైనా ఉండొచ్చు కానీ.. ప్రయత్నం చేయకుండా ఉండొద్దని ఆయన అన్న వ్యాఖ్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని అన్నారు.
శివన్కు ఓదార్పు.. ముందుకు సాగాలంటూ మోడీ
కాగా, చంద్రయాన్ 2 ప్రయోగం చివరి దశలో విఫలం కావడంతో ఇస్రో ఛైర్మన్ శివన్ భావోద్వేగంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఆ సమయంలో అక్కడేవున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆయన్ను దగ్గరికి తీసుకొని హత్తుకున్నారు. ఆయనను ఓదార్చారు. మన ప్రయత్నం మనం చేశాం.. ఫలితం అనుకున్నట్లు రాలేదు. అయినా అధైర్యపడకుండా ముందుకు సాగాలి. సాధించాల్సింది చాలా ఉందని శాస్త్రవేత్తల్లో మనోస్థైర్యాన్ని నింపారు ప్రధాని మోడీ.