కేజ్రీవాల్పై గుడ్లదాడి: అళగిరిపై కరుణ వేటు, తండ్రితో ఫైట్
లక్నో/చెన్నై: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్యకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మంగళవారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో చేదు అనుభవం కలిగింది. వారణాసిలో కేజ్రీవాల్ వాహనంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు.
వారణాసిలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. మంగళవార వారణాసిలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన కాశీ విశ్వనాథుడి ఆలయానికి వెళ్లి వస్తుండగా కోడిగుడ్లతో దాడి చేశారు.
అళగిరి మంతనాలు
లోకసభ ఎన్నికలకు ముందు తమిళనాడులో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన డిఎంకె నాయకుడు ఎంకె అళగిరి తన అనుచరులతో మంతనాలు జరిపి వారి మద్దతును కూడగట్టుకునేందుకు వీలుగా రాష్టవ్య్రాప్త పర్యటన ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఆమోదించిన అళగిరి ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తారన్న ఊహాగానాల నడుమ ఈ పర్యటనను ప్రారంభించబోతున్నారు.
డిఎంకె నాయకత్వ నిరంకుశత్వాన్ని వ్యతిరేకించడంతో పాటు పార్టీ ముఖ్య విలువలకు కట్టుబడివున్న నాయకులను, కార్యకర్తలను అళగిరి కలవనున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. దక్షిణాది జిల్లాల్లోని మద్దతుదారుల నుంచే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మద్దతుదారుల నుంచి అళగిరిపై వత్తిడి వస్తోందని, వారంతా అళగిరిని కలసి తమ సమస్యలు విన్నవించుకోవాలని భావిస్తున్నారని సస్పెన్షన్ వేటుకు గురైన డిఎంకె జనరల్ కౌన్సిల్ సభ్యుడు, అళగిరి విధేయుడు ముబారక్ మంత్రి సోమవారం పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.
అళగిరిని పార్టీ నుండి తొలగించిన కరుణ
కరుణానిధి (89) తన కుమారుడు అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున అతడిపై శాశ్వతంగా వేటు వేస్తున్నట్టు కరుణానిధి తెలిపారు. పార్టీ జనరల్ సెక్రటరీతో కలిసి తానీ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు. క్రమశిక్షణ చర్యల కింద అళగిరిని గత ఫిబ్రవరిలో పార్టీ పదవుల నుంచి తొలగించారు.