వినాయకుడి మండపం వద్ద తాగి తందనాలు..రికార్డింగ్ డాన్సులు: ఎనిమిది మంది కటకటాల వెనక్కి
అహ్మదాబాద్: పవిత్రంగా చూసుకోవాల్సిన వినాయకుడి విగ్రహాల వద్ద రికార్డింగ్ డాన్సులను ఏర్పాటు చేశారు స్థానిక యువకులు. రికార్డింగ్ డాన్సర్లతో పాటు తామూ చిందులు వేశారు..బీరు బాటిళ్లతో. మద్యాన్ని సేవిస్తూ మహిళా రికార్డింగ్ డాన్సర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పోలీసుల దృష్టికి చేరింది. వీడియో తమ కంట పడ్డ వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. ఈ ఘటనకు కారణమైన ఎనిమిదిమంది యువకులను అరెస్టు చేశారు. కస్టడీకి తరలించారు. గుజరాత్ లోని సూరత్ లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతిపిత మహాత్మాగాంధీ పుట్టిన రాష్ట్రమైనందున గుజరాత్ లో దశాబ్దాల నుంచీ సంపూర్ణ మద్యనిషేధం కొనసాగుతోన్న విషయం తెలసిందే.
సూరత్ లోని కోట్ సఫిల్ రోడ్డులో స్థానిక యువకులు కొందరు చందాలను వసూలు చేసి, గణేషుడి మండపాన్ని ఏర్పాటు చేశారు. చవితి రోజు రాత్రి వినాయకుడికి ఘనంగా తొలిపూజలు చేశారు. ఆ వెంటనే- రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రికార్డింగ్ డాన్స్ నిర్వహించడానికి పోలీసుల అనుమతి ఉంది. అక్కడితో ఆగిపోలేదు. సంపూర్ణ మద్యనిషేధం కొనసాగుతున్న సమయంలో బీరు బాటిళ్లను అక్రమంగా తీసుకొచ్చి, బహిరంగంగా దాన్ని సేవించడం మొదలు పెట్టారు.
మద్యపాన నిషేధం ఉన్న సమయంలో ఆ యువకులు వినాయక మండపంలోనే బీర్లు సేవించడం, హల్ చల్ చేయడానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో మంగళవారం రాత్రి పోలీసుల దృష్టికి చేరింది. దీనిపై కోట్ సఫిల్ రోడ్డులో నివసించే కొందరు స్థానికులు కూడా మహీధర్ పురా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. పొరుగునే ఉన్న మహారాష్ట్ర నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు యువకులు తమ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సూరత్ డీసీపీ జోన్-2 బీార్ పండోర్ తెలిపారు.