అసోంను వదలని వరదలు... నిరాశ్రయులైన 63 వేల మంది ప్రజలు..
అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటితో నదులు ఉప్పొంగుతున్నాయి. వర్షాలు వరదతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ధిమాజీ, లఖీంపూర్, బిశ్వనాథ్, గోలాఘాట్, జోర్హాట్, దిబ్రూఘడ్, చిరాంగ్, బర్పేట జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.
8 జిల్లాల్లో 150కిపైగా గ్రామాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్న 63వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ధిమాజీ జిల్లాపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఒక్క ఆ జిల్లాలోనే 22 వేల మంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేసిన ఆశ్రయం కల్పించారు.
రుతుపవనాల ప్రభావంతో అసోంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే నిమతిఘాట్, ధనసిరి, గోలాఘాట్, సోనిత్పూర్, కాంరూప్, బార్పేట వద్ద బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరదల కారణంగా రోడ్లు, వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. దాదాపు 3,500 హెక్టార్లలో పంట నీట మునిగింది.