ఆ 8 ఈఎస్ఐ ఆసుపత్రులు ఇక కోవిడ్-19 ఆసుపత్రులు.. ఎక్కడెక్కడంటే..?
కరోనాపై పోరులో భారత్ అన్ని వనరులను ఉపయోగించుకుంటోంది. టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. ఆసుపత్రుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. రైళ్లల్లోనూ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసి ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకు సిద్దమవుతంది. తాజాగా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ESIC) సైతం కరోనా నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1042 పడకలతో వివిధ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను సిద్దంగా ఉంచింది. ఈ మేరకు ఒక నోటిస్ను కూడా విడుదల చేసింది.
అందులో పేర్కొన్న వివరాల ప్రకారం గుజరాత్లోని అంక్లేశ్వర్,హర్యానాలోని గురుగ్రామ్,గుజరాత్లోని వాపి,రాజస్తాన్లోని ఉదయ్పూర్,హిమాచల్ ప్రదేశ్లోని బద్దీ,జార్ఖండ్లోని ఆదిత్యాపూర్,పశ్చిమ బెంగాల్లోని జోక్తా,జమ్మూల్లోని ఈఎస్ఐసీ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ఇవికాకుండా మరో 1112 ఐసోలేషన్ పడకలను దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినట్టు తెలిపింది. రాజస్తాన్లోని అల్వార్,బీహార్లోని పట్నా బిహ్తా,కర్ణాటకలోని గుల్బర్గా,ఛత్తీస్ఘడ్లోని కోర్బా ఈఎస్ఐసీ ఆసుపత్రుల్లో క్వారెంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.
ఈఎస్ఐ సభ్యత్వం ఉన్నవారు లాక్ డౌన్ పీరియడ్లో ప్రైవేట్మెడికల్ షాపుల నుంచి మందులు కొనుగోలు చేస్తే.. ఆ రుసుమును రీయింబర్స్మెంట్ ఉంటుందని తెలిపింది. ఎక్కడెక్కడైతే ఈఎస్ఐ ఆసుపత్రులను కోవిడ్ 19 ఆసుపత్రులుగా ఏర్పాటు చేశారో..
అక్కడ వాటికి అనుబంధంగా మరో ఆసుపత్రిలో మిగతా మెడికల్ సర్వీసులు అందించడం జరుగుతుందని వెల్లడించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అవుతున్నామని.. అవసరమైన మాస్కులు,పీపీఈ కిట్స్ను సమకూర్చుకుంటున్నామని తెలిపింది.