నరకం చూస్తున్నాం! కాపాడండి: 9నెలలుగా నౌకలోనే 8మంది భారత నావికులు
దుబాయ్: భారతదేశానికి చెందిన ఎనిమిది మంది నావికులు దాదాపు 9నెలలపాటు ఓ నౌకలోనే ఉంటున్నారని మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. పనామాకు చెందిన నౌక గత నవంబర్లో దుబాయ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది.
అప్పటి నుంచి ఆ నౌక నడిపిస్తున్న కంపెనీ అందులో పనిచేస్తున్న భారత నావికులకు సరిపడినంత ఆహారం, ఇంధనం ఇవ్వకుండా సముద్రంలోనే వదిలేసిందని గల్ఫ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. వారికి పూర్తి వేతనం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని తెలిపింది.
ఎంవీ టాప్మ్యాన్ అనే షిప్ దుబాయ్ మారిటైం సిటీ(డీఎంసీ)లోని 13వ నెంబరు బెర్త్ వద్ద నిలిపి ఉంచారు. తాము దుబాయ్కి వచ్చినప్పటి నుంచి ఒక నెల జీతం మాత్రమే ఇచ్చారని, సరిపడినంత ఆహారం, తాగునీరు సరఫరా చేయడం లేదని నౌకలోని సిబ్బంది వెల్లడించినట్లు మీడియా కథనంలో తెలిపింది.
ఇంధనం కూడా అయిపోయిందని చెప్పినట్లు వెల్లడించింది. 'మేము కేవలం బతికి ఉన్నాం. ఏడు నుంచి ఎనిమిది కిలోలు తగ్గాం. మా వద్ద శక్తి లేదు. మా కుటుంబాలు మేము తిరిగి ఎప్పుడొస్తామని ఎదురుచూస్తున్నాయి. ఇక ఆత్మహత్యే శరణ్యం' అని వారిలో ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు.
యూఏఈ వీసాలు లేనందున నావికులెవ్వరూ షిప్ దాటి బయటకు వెళ్లడానికి వీల్లేదని, నౌకలో ఎంఎల్సీ కంప్లైంట్ సర్టిఫికెట్, అగ్నిమాపక యంత్రాలు పనిచేయడం లేదని నౌకలోని సీనియర్ నావికుడొకరు తెలిపారు. తమను ఎలాగైన స్వదేశానికి తీసుకెళ్లాలని బాధిత నావికులు వేడుకుంటున్నారు. కాగా, నావికులు, నౌక యజమానితో సంప్రదింపులు జరుపుతున్నామని భారత కాన్సులేట్ వెల్లడించింది.