ఢిల్లీ అసెంబ్లీలో మహిళామణుల కళకళ.. ఆప్ నుంచే ఎనిమిది మంది అతివలు..
ఢిల్లీ ఎన్నికల్లో మహిళా నేతలు సత్తాచాటారు. మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేందుకు పోటీపడగా.. ఆప్ నుంచి ఏకంగా ఎనిమిది మంది విజయం సాధించారు. ఒక మహిళా అభ్యర్థి మాత్రమే ఓటమి పాలయ్యారు. 2020 ఢిల్లీ అసెంబ్లీలో మహిళా మణులు నిండుగా కనిపించనున్నారు.
24 మహిళా నేతలకు టికెట్లు..
2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ 24 మంది మహిళలకు టికెట్లు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ 10 మంది మహిళలకు టికెట్ ఇచ్చింది. అయితే అందులో ఒక్కరు కూడా గెలవకపోవడం విశేషం. అంతేకాదు డిపాజిట్ కూడా రాకపోవడం కాసింత ఆందోళన కలిగిస్తోంది. ఆప్ 9 మందికి బీజేపీ ఐదుగురు మహిళలకు టికెట్ ఇచ్చింది. 672 మంది మొత్తం అభ్యర్థులు మహిళలు 79 మంది ఉన్నారు. 2015లో అది 66 సభ్యులుగా ఉంది. అంటే 13 మంది మహిళల సంఖ్య పెరిగింది.
లోక్సభలో ఓటమి.. అసెంబ్లీలో విజయం..
లోక్ సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి పోటీచేసి ఓడిపోయిన అతిషి.. కాల్కజి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అవతార్ కాల్కాను 11 వేల 300 ఓట్లతో మట్టికరిపించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి ఆప్లో చేరిన ధానవతి చాందేలా రాజౌరి గార్డెన్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. చందేలా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దయానంద్ చందేలా భార్య. బీజేపీ అభ్యర్థి రమేశ్ ఖన్నాపై 22 వేల 972 ఓట్ల తేడాతో గెలుపొందారు.
20 వేల ఓట్ల ఆధిక్యంతో..
హరినగర్ నియోజకవర్గం నుంచి రాజ్ కుమారి ధిల్లాన్ విజయం సాధించారు. బీజేపీ నేత తేజిందర్ పాల్ సింగ్పై 20 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. షర్మిలా బాగ్ నుంచి ఆప్ నేత బందానా కుమారి మరోసారి గెలుపొందారు. బీజేపీ మహిళ నేత రేఖా గుప్తాపై 3400 ఓట్ల తేడాతో విజయం సాధించారు. త్రినగర్ నియోజకర్గం నుంచి ఆప్ నేత ప్రీతి తోమర్ విజయం సాధించారు. బీజేపీ నేత రామ్ గుప్తాపై 10 వేల 700 ఓట్ల తేడాతో గెలుపొందారు.
బీజేపీ నేతలపై...
పాలెం నియోజకవర్గం నంచి ఆప్ మహిళా నేత భావన గౌర్ విజయం సాధించారు. బీజేపీ నేత విజయ్ పండిట్ పై 32 వేల ఆధిక్యంతో గెలుపొందారు. ఆర్కే పురం నియోజకవర్గం నుంచి ఆప్ నేత ప్రమీలా తోకస్ విక్టరీ కొట్టారు. బీజేపీ నేత అనిల్ కుమార్ శర్మపై 10 వేల ఓట్లతో గెలుపొందారు.
మట్టికరిచిన అల్కా లాంబా
మంగొల్ పురి నియోజకవర్గం నుంచి ఆప్ నేత రాఖీ బిర్లా విజయం సాధించారు. బీజేపీ నేత కరమ్ సింగ్ కర్మపై 30 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆప్ నేత ప్రహ్లాద్ సింగ్ సాన్వీ చాందినీ చౌక్ నుంచి గెలుపొందారు. ఆప్ నేత సరితా సింగ్ ఒక్కరే బీజేపీ నేత జితేందర్ మహాజన్ చేతిలో 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.