ఆగం చేసిన లాక్ డౌన్.. ఎంత ప్రమాదంలోకి నెట్టిందంటే.. భారత్లో ప్రతీ 10 మందిలో 8 మంది..
పేద,మధ్య తరగతి ప్రజల్లో ఎక్కువమంది దినసరి కూలీలు,నెలవారీ జీతంపై ఆధారపడి బతికేవారే. కుటుంబంలో ఒక వ్యక్తి సంపాదనపై కనీసం ఇద్దరు లేదా ముగ్గురు ఆధారపడి ఉంటారు. పని ఉన్న రోజుల్లోనే చాలీ చాలని జీతాలతో నెట్టుకొచ్చే ఈ కుటుంబాలు ఇప్పుడు కరోనా లాక్ డౌన్ దెబ్బకు మరింత కష్టాల్లో కూరుకుపోయాయి. పని లేక,అవసరాలకు చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వెల్లడైన అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం లాక్ డౌన్ ఎఫెక్ట్తో దేశంలో 67శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్ డౌన్ పేద,మధ్య తరగతి ఉద్యోగాలపై దెబ్బకొట్టి వారి జీవితాలను అభద్రతలోకి నెట్టేసింది.
ఉద్యోగ,ఉపాధి రంగంలో బ్లడ్ బాత్.. కూలీలు,చిన్న వ్యాపారులు,వేతన జీవులపై ఎఫెక్ట్.. షాకింగ్ రిపోర్ట్స్.
ప్రతీ 10 మందిలో 8 మంది..
10 సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లతో అజీమ్ ప్రేమ్ జీ వర్సిటీ సంయుక్తంగా ఈ సర్వేను చేపట్టింది.ఇందులో భాగంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,బీహార్,ఢిల్లీ,గుజరాత్,జార్ఖండ్,కర్ణాటక,మధ్యప్రదేశ్,మహారాష్ట్ర(పుణే),రాజస్తాన్,ఒడిశా,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 4000 మంది వ్యక్తులను ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు సేకరించింది. సర్వే ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో ప్రతీ 10 మంది ఉద్యోగుల్లో 8 మంది,గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ 10 మంది ఉద్యోగుల్లో ఆరుగురు ఉద్యోగాలు కోల్పోయారు.
84శాతం మంది స్వయం ఉపాధి కోల్పోయారు..
పట్టణ ప్రాంతాల్లో 76శాతం మంది వేతన జీవులు,81శాతం మంది సాధారణ కార్మికులు ఉద్యోగ,ఉపాధిని కోల్పోయారు. అలాగే స్వయం ఉపాధి పొందుతున్న 84శాతం మంది ఉపాధిని కోల్పోయారు. గ్రామీణ ప్రాంతాల్లో 66శాతం మంది సాధారణ కార్మికులకు ఉద్యోగ,ఉపాధి లేకుండా పోయింది. అలాగే 62శాతం మంది వేతన జీవులు, 47శాతం మంది గ్రామీణ కూలీలు,కార్మికులు ఉపాధిని కోల్పోయారు.
తగ్గిన కూలీల,కార్మికుల సంపాదన..
వ్యవసాయేతర రంగాల్లో ఇప్పటికీ ఉపాధి పొందుతున్న కూలీల/కార్మికుల సగటు ఆదాయం ఒక వారానికి రూ.2240 నుంచి రూ.218కి పడిపోయింది. అంటే,దాదాపు 90శాతం ఆదాయాన్ని వారు కోల్పోయారు. ఇక ఇప్పటికీ ఉపాధి పొందుతున్న సాధారణ కార్మికుల ఒక వారపు సగటు ఆదాయం సగానికి పడిపోయింది. ఫిబ్రవరి నెలలో ఒక వారానికి రూ.940 సంపాదించిన ఆ కార్మికులు ఇప్పుడు కేవలం రూ.495 మాత్రమే సంపాదించగలుగుతున్నారు. ఇక వేతన జీవుల్లో దాదాపు 51శాతం మంది వేతనాల్లో కోతలతో లేక అసలు వేతనమే పొందక ఇబ్బందులు పడుతున్నారు.
Recommended Video
తిండి కూడా తగ్గించిన కుటుంబాలెన్నో తెలుసా..
దేశవ్యాప్తంగా దాదాపు 49శాతం కుటుంబాలు కనీసం ఒక వారానికి సరిపడా నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలోకి వెళ్లాయి. అంతేకాదు,పట్టణ ప్రాంతాల్లో దాదాపు 80శాతం కుటుంబాలు,గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 70శాతం కుటుంబాలు గతం కంటే తక్కువ ఆహారాన్ని తీసుకుంటున్నామని చెప్పాయి. ఇక పట్టణ ప్రాంతాల్లో మూడింట ఒకవంతు మంది(36శాతం)కి ప్రభుత్వ నగదు బదిలీ పథకం అందినట్టు సర్వేలో తేలింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 53శాతం మంది దీని ద్వారా లబ్ది పొందారు.