అదృశ్యమైన చిన్నారి శవమై కనిపించింది..పక్కింట్లోనే ఘటన
ఉత్తర్ ప్రదేశ్ : నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది ఉత్తర్ ప్రదేశ్. అలీగఢ్లో మూడేళ్ల చిన్నారిని హత్య చేసిన ఘటన మరువకముందే కస్గాంజ్ జిల్లాలో మరో దారుణం వెలుగు చూసింది. ఎనిమిదేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు హత్యచేశారు. సోమవారం నుంచి బాలిక కనిపించలేదు. ఏదో భారీ ఆయుధంతో ఆమెను దుండగులు హత్యచేశారని ఆపై శరీరంపై యాసిడ్తో వేసినట్లుగా ఉందని పోలీసులు తెలిపారు. బాలిక గ్రామంలోని ఓ ఇంట్లో మృతదేహం దొరికిందని ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వృద్ధురాలితో పాటు ఉన్న ఆమె మనవడు మరో మైనర్ కనిపించడం లేదని వెల్లడించారు.
మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పోలీసులు తరలించినట్లు డీఐజీ ప్రీతీందర్ సింగ్ తెలిపారు. పోస్టు మార్టం నివేదిక వస్తే హత్య ఎళా జరిగిందనేది తెలుస్తుందని ఆ ప్రకారంగా విచారణ మొదలు పెడతామని పోలీసులు వెల్లడించారు. అయితే అమ్మాయి ముఖంపై యాసిడ్తో దాడి చేశారని ఇప్పుడప్పుడే చెప్పలేమని అన్నారు. ప్రస్తుతం పోలీసులు కనిపించకుండా పోయిన వృద్ధురాలి మనవడి కోసం గాలిస్తున్నారు. ఆ వృద్ధురాలు మృతురాలికి బంధువు అని పోలీసులు చెప్పారు.
అంతకుముందు బాలిక కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యదు చేశారు. ముందుగా ఆమె కోసం వెతికి ఎంతకీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇక బాలిక కోసం వెతుకుతున్న సమయంలో వృద్ధురాలి ఇంటినుంచి ఏదో చెడు వాసన వస్తోందని స్థానికులు తమతో చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు బాలిక మృతదేహాన్ని కనుగొన్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.