నరేంద్రమోడీ స్పీచ్పై ఘాటు కామెంట్లు చేసిన వైసీపీ రాజకీయ వ్యూహకర్త: జనం ఫూల్స్ కాదంటూ ..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నవేళ..మంగళవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నిప్పులు చెరిగారు. మూడుదశలుగా సుమారు 50 రోజుల పాటు దేశం మొత్తం లాక్డౌన్లో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడాన్ని ప్రశాంత్ కిశోర్ పరోక్షంగా తప్పుపట్టారు.
ప్రధాని చేసిన ప్రసంగం ప్రపంచ ప్రజలందరూ మూర్ఖులుగా భావించినట్లుగా కనిపిస్తోందని అన్నారు. ప్రపంచం మొత్తం మూర్ఖులైనా అయ్యుండాలి..లేదా వారందరి కంటే మనం ఎక్కువ తెలివిపరులమైనా అయ్యుండాలి.. అని నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన ఓ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ ప్రాణాంతకంగా పరిణమించిన చోట..దాన్ని అవకాశంగా మార్చుకోవాలనుకోవడం సరికాదని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. లాక్డౌన్ను ఎత్తేయడానికి సరైన మార్గాలను అన్వేషించడంలో కేంద్రం విఫలమైందనే ఉద్దేశంతో ప్రశాంత్ కిశోర్ ఈ ట్వీట్ చేశారని అంటున్నారు.
ఇదివరకు బిహార్లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్) పార్టీలో కొనసాగిన ఆయన.. ఈ మధ్యే వైదొలిగారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు వంటి కార్యక్రమాలను నిరసిస్తూ ఆయన భారతీయ జనతాపార్టీ, ఎన్డీఏ కూటమిని విమర్శించడం వల్ల జేడీయూ చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయనపై వేటు వేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకూ బీజేపీకి ప్రశాంత్ కిశోర్ మధ్య సన్నిహిత సంబంధాలే ఉండేవి.
మా జగ్గాడికి తెలిసింది అదొక్కటే: జగన్పై మాజీ ముఖ్యమంత్రి సోదరుడి సెటైర్లు: ప్యాకేజీ పైనా
Recommended Video
బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా కూడా ఆయన పని చేశారు. దాని తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంల.. బీజేపీకి దూరం అయ్యారు. రాజకీయ వ్యూహకర్తగా కొనసాగారు. 2019 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు. ఈ ఎన్నికలు ముగిసిన కొద్దిరోజులకే ఆయన జేడీయులో చేరినప్పటికీ.. పార్టీ అగ్ర నాయకత్వం బీజేపీ పట్ల మెతక వైఖరిని ప్రదర్శించడాన్ని తప్పు పట్టారు. దీనితో ఆయనపై వేటు వేసింది. తాజాగా మరోసారి ప్రధాని ప్రసంగాన్ని విమర్శించి.. బీజేపీతో తనకు ఉన్న బద్ధ వైరాన్ని చాటిచెప్పుకున్నారని చెబుతున్నారు.