ఏపీ సర్కార్ బాటలో మహా ప్రభుత్వం: పరిశ్రమల్లో 80% ఉద్యోగాలు స్థానికులకే: తొలి కేబినెట్లో ఆమోదం!
ముంబై: శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సారథ్యంలో మహారాష్ట్రలో మరి కాస్సేపట్లో ఏర్పాటు కాబోయే మహా వికాస్ అఘాడి సంకీర్ణ కూటమి సర్కార్.. ఏపీ ప్రభుత్వాన్ని అనుసరిస్తోందా? అంటే ఆ విషయంలో అవుననే అనుకోవచ్చు. పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే కేటాయించబోతోంది. ఈ మేరకు శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి సంయుక్తంగా రూపొందించిన కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్-సీఎంపీ)లో పొందుపరిచారు.
తొలి కేబినెట్ నేడే..
ఈ సాయంత్రం 6:40 నిమిషాలకు ముంబైలోని ప్రఖ్యాత శివాజీ పార్కులో ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన శాసన సభ్యులు ఇద్దరు చొప్పున ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ వెంటనే కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే క్యాబినెట్ సమావేశం అవుతుంది. ఉద్ధవ్ థాకరే నాయకత్వంతో తొలి కేబినెట్ భేటీ కానుంది. మహారాష్ట్ర సచివాలయంలోని ఆరో అంతస్తులో తొలి కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
కనీస ఉమ్మడి ప్రణాళికను ఆమోదించడానికే..
మహా వికాస్ అఘాడీ సంకీర్ణ కూటమి తరఫున రూపొందించిన కనీస ఉమ్మడి ప్రణాళికను ఆమోదించడానికే క్యాబినెట్ హడావుడిగా సమావేశం కానుంది. ఈ కనీస ఉమ్మడి ప్రణాళికను మంత్రివర్గం ఆమోదించడం వల్ల చట్టబద్ధత ఏర్పడుతుంది. మంత్రివర్గంలో చేసిన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి.. చట్టబద్ధత కల్పిస్తారు. ఈ ఉద్దేశంతోనే ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే కనీస ఉమ్మడి ప్రణాళికను ఆమోదించడానికి మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కానుంది.
ఏపీ తరహాలో
మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ ను కల్పించిన విషయం తెలిసిందే. దీన్ని మంత్రివర్గంలో ఆమోదించిన తరువాత.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. చట్టంగా రూపొందించారు. అదే తరహాలో.. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించనుంది. ఈ విషయాన్ని కనీస ఉమ్మడి ప్రణాళికలో పొందుపరిచింది. కొత్తగా ఏర్పాటు కాబోయే పరిశ్రమలతో పాటు ఇప్పటికే స్థాపించిన సంస్థల్లోనూ 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని అన్నారు.
కనీస ఉమ్మడి ప్రణాళికలో ఇంకా ఏమేం ఉన్నాయంటే..
రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్య, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, పరిశ్రమలు, సామాజిక న్యాయం, పర్యాటక రంగాలను కనీస ఉమ్మడి ప్రణాళికలో పొందుపరిచారు. ఆయా అంశాల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై వివరంగా చర్చించారు. వాటిని తప్పనిసరిగా ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రణాళికను ఏక్ నాథ్ షిండే, జయంత్ పాటిల్, నవాబ్ మాలిక్ విడుదల చేశారు. తొలి క్యాబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదిస్తామని, ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే మంత్రివర్గ సమావేశం ఉంటుందని అన్నారు.