గేదెపై ఎన్నికల ప్రచారం .. కోడ్ ఉల్లంఘన అని సీరియస్ అయిన ఈసీ
దేశంలో ఎన్నికల సంగ్రామం జరుగుతుంది .ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారం పైనే దృష్టి సారించాయి. ఎన్నికల సంగతి ఏమో కానీ ప్రచారం మాత్రం కొత్త పుంతలు తొక్కుతుంది. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్లోని మొరేనా లో డోర్ బెల్ పాడైంది తలపులు తీసేందుకు దయచేసి మోడీ మోడీ అరవండి అంటూ ఓ ఆసక్తికర ప్రచారం సాగితే తాజాగా గేదె పై ఎన్నికల ప్రచారం చేసి మరో సంచలనం అవుతుందని భావించారుఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ యువత . అయితే అది కాస్తా రివర్స్ అయ్యింది .. అసలు ఏం జరిగింది అంటే
ఛత్తీస్గఢ్లో ఆసక్తికర ప్రచారం .. గేదెపై కాంగ్రెస్ కు ఓటెయ్యాలని రాసిన యువత
ఛత్తీస్గఢ్లోని కవర్దాలో వినూత్న ఎన్నికల ప్రచారం అని భావించి స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు సరికొత్త ప్రచారానికి తెరలేపారు. ఓ పాడి గేదెపై... ‘మా మాట వినండి. ఈ సారికి కాంగ్రెస్ను ఎన్నుకోండి. కాంగ్రెస్కే ఓటేయండి' అనే అర్థం వచ్చేలా హిందీలో రాశారు. తర్వాత పలుపు తాడు విప్పేసి ఆ గేదెను వదిలేశారు. అది వెళ్లిన ప్రతిచోటా జనం దాన్నే చిత్రంగా చూస్తున్నారు. కొందరు దానితో ఫొటోలను దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఎలాంటి ఖర్చూ లేకుండా... అందరి దృష్టినీ ఆకర్షిస్తుండటంతో స్థానిక యువత సంతోషించారు. అంతే కాకుండా ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చుకు కూడా పరిమితి విధించటంతో ఫ్రీ గా ఎలాంటి ఖర్చు లేకుండా ప్రచారం జరుగుతుంది అని భావించారు కానీ అక్కడే సీన్ రివర్స్ అయ్యింది.
మూగ జీవాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించటం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అంటున్న ఈసీ
గేదెపై జరుగుతున్న ప్రచారానికి చాలా మంచి స్పందన వచ్చినప్పటికీ ఈసి మాత్రం ఇది కచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని పేర్కొంది. గేదెపై ప్రచారం చేసే విషయం ఎన్నికల సంఘానికి చేరింది. నోరు లేని పశువులను ప్రచారానికి వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని, అలా చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ విషయంలో ఈ ప్రచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించే ఆలోచనలో ఉన్నారు.
మూగ జీవాలపై ప్రచారానికి తాము విరుద్ధమని తెలిపిన కాంగ్రెస్ ..
ఇక గేదెపై జరుగుతున్న ప్రచారం కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజిచ్చినప్పటికీ అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన క్రిందకు వస్తుందని భావించి కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ వివాదంపై స్పందించారు. ఈ వివాదంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి శైలేష్ నితిన్ త్రివేది మాట్లాడుతూ ‘ఈ తరహా ప్రచారానికి మా పార్టీ వ్యతిరేకం. గేదెను వినియోగించిన స్థానిక యువతను గుర్తిస్తాం. వారిపై ఫిర్యాదు చేస్తాం' చెప్పటంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖంగు తిన్నారు. పార్టీ కోసం స్పెషల్ గా ఉంటుందని ప్రచారం నిర్వహిస్తే అది తిరిగి తమకే ఇబ్బందికరంగా మారిందని వారు లోలోపల బాధ పడుతున్నారు. మొత్తానికి గేదెపై కాంగ్రెస్ కు ఓటు వెయ్యమని రాసి వింత ప్రచారం చేసిన యువత పై ఇప్పుడు మూగ జీవాలను ప్రచారానికి వినియోగించకూడదని చెప్పిన ఈసీ సీరియస్ అవ్వటం, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఫైర్ అవ్వటం స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది.