ఎలక్షన్ కమీషన్ కీలక నిర్ణయం .. జంతువులతో ప్రచారం నిషేధం
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.లోక్ సభ ఎన్నికల సందర్భంగా దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు చేపట్టే ప్రచార కార్యక్రమాల్లో జంతువులను గానీ, పక్షులను గానీ, సరీసృపాలను గానీ ఉపయోగించకూడదంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలను పాటించకపోవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఈసీ తెలిపింది. అంతేకాకుండా ప్రచారంలో భాగంగా జంతువులకు, పక్షులకు ఎటువంటి హాని తలపెట్టకూడదని సూచించింది.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల వల్ల జంతువులకు పెద్ద ఎత్తున హాని కలుగుతోందని పెటా, పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతూ ఈసీని ఆశ్రయించారు. దీంతో ఎన్నికల సంఘం ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పెటా సీఈవో ఎం.వల్లియతీ మాట్లాడుతూ..'ఎన్నికల ప్రచారంలో కొందరు రాజకీయ నాయకులు జంతువులకు హాని కలిగిస్తున్నారు. వాటిని కొట్టడం, ఎక్కువ సమయం ఎండలో నిలబెట్టడం, వాటికి సరైన తిండి పెట్టకుండా ఉండటం వంటివి చేస్తున్నారు. ఇప్పటికే జంతువుల స్థాయి పడిపోతోంది. పక్షులకు రేడియేషన్ వల్ల హాని జరుగుతోంది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషంగా ఉంది' అని తెలిపారు.
ఎన్నికల కోడ్ వర్తిస్తుందే బాలా..! వెడ్డింగ్ కార్డులో మోడీ ప్రస్తావనకు నోటీసులు
జంతువులతో ప్రచారం పై నిషేధం మహారాష్ట్ర, అసోం, మిజోరాం, తమిళ్ నాడు, గుజరాత్, కేరళ, సిక్కిం, హిమాచల ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో,అండమాన్ నికోబార్ దీవుల్లోనూ అమలుకానుంది. మొత్తానికి జంతువుల పరిరక్షణ కోసం, వాటికి హాని కలగకుండా ఉండడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రచారంలో జంతువులను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.