విశాల్ దెబ్బ: ఎన్నికల అధికారి వేలుస్వామిపై వేటు, మళ్లీ ఆయన వచ్చారు, ఏం చేస్తారో!
చెన్నై: చెన్నైలోని ఆర్ కే నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేలుస్వామిపై వేటు పడింది. ప్రముఖ నటుడు, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ నామినేషన్ వ్యవహారంలో వివాదాస్పదంగా వ్యవహరించిన వేలుస్వామి మీద పై భారత కమిషన్ సీరియస్ అయ్యింది.
హీరో విశాల్ నామినేషన్ వ్యవహారంలో ప్రతిపక్షాలు సైతం తీవ్ర విమర్శలకు దిగడంతో ఈసీ వేలుస్వామిని తప్పించాలని నిర్ణయం తీసుకుంది. హీరో విశాల్ నామినేషన్ పత్రాలను తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి వేలుస్వామిని భారత ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది.
హీరో విశాల్ నామినేషన్ తిరస్కరణపై డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తీవ్రంగా ప్రతిస్పందించిన విషయం తెలిసిందే. విశాల్ నామినేషన్ను తిరస్కరించే విషయంలో భారత ఎన్నికల కమిషన్ అన్నాడీఎంకే పార్టీతో కుమ్మక్కు అయ్యిందని స్టాలిన్ ఆరోపించారు.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేలుస్వామిని విధుల నుంచి తప్పించిన భారత ఎన్నికల కమిషన్ ఆయన స్థానంలో ప్రవీణ్ నాయర్ ను నియమించింది. ఇదే ఏడాది ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు నిర్వహించడానికి సిద్దం అయిన సమయంలో రిటర్నింగ్ అధికారిగా ఇదే ప్రవీణ్ నాయర్ ఉన్నారు.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో భారీ మొత్తంలో నగదు, ఖరీదైన వస్తువులు పంచిపెట్టారని గుర్తించిన ప్రవీణ్ నాయర్ ఢిల్లీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ నాయర్ దెబ్బతోనే గతంలో ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు రద్దు అయ్యాయి. ఇప్పుడు మళ్లీ ప్రవీణ్ నాయర్ కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉంది.