పొలిటికల్ యాడ్స్పై ఈసీ కన్ను.. ఆ రెండు రోజులు నిషేధం..!
ఢిల్లీ : లోక్సభ పోరులో ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. పొలిటికల్ యాడ్స్ పై కత్తెర వేసింది. పోలింగ్ నాడు, అలాగే దానికి ఒక రోజు ముందు, ఆ రెండు రోజులు (48 గంటలు) కూడా పెద్దసంఖ్యలో యాడ్స్ ప్రచురిస్తాయి రాజకీయ పార్టీలు. అయితే ఇకపై స్క్రీనింగ్ కమిటీలు అనుమతించని పొలిటికల్ యాడ్స్ ప్రచురించడానికి వీల్లేదు. ఆ మేరకు నిషేధం విధించామని ఈసీ స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ మీడియాపై ఈ తరహా నిషేధం ఇప్పటికే కొనసాగుతోంది.
ఈసీ నజర్
పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఆయా పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచుతారు. ఆ క్రమంలో పోలింగ్ కు చివరి రెండు రోజులు దినపత్రికల్లో యాడ్స్ హోరెత్తిస్తారు. ఫ్రంట్ పేజీల్లో ఫుల్ యాడ్స్ ఇచ్చేస్తారు. అయితే ఈసారి ఏడు విడతలుగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో అది కుదరని తేల్చింది ఈసీ. పోలింగ్ నాడు, దానికి ఒక రోజు ముందు (48 గంటలు) స్క్రీనింగ్ కమిటీలు ధృవీకరించని యాడ్స్ను ప్రచురించకుండా నిషేధం విధించింది.
రాజ్యాంగం ప్రకారం కొన్ని అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇలాంటి నిర్ణయం ఇప్పుడే కొత్త కాదు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొదటిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.
అలా అయితే ఓకే.. లేదంటే నిషేధమే..!
పోలింగ్ చివరి రెండు రోజులు పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్లు ప్రచురించకుండా ఎప్పటినుంచో ఈసీ ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలో చాలాకాలంగా ఈ అంశం న్యాయశాఖ దగ్గర నానుతోంది. ఏళ్లకొద్దీ పెండింగ్ లో ఉంటోంది. అయితే ఎన్నికల చివరి దశలో పొలిటికల్ యాడ్స్ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉంటున్నాయనే విషయం గతంలో తమ దృష్టికి వచ్చిందంటున్నారు ఈసీ అధికారులు. అంతేకాదు వాటిలో కొన్ని దురుద్దేశపూరితంగా ఉంటున్నాయని చెబుతున్నారు.
అలాంటి పొలిటికల్ యాడ్స్ కారణంగా మొత్తం ఎన్నికల ప్రక్రియకు దెబ్బ తగులుతుందనేది ఈసీ వాదన. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు.. సంబంధిత పార్టీలుగానీ, పోటీ చేసే అభ్యర్థులు గానీ వివరణ ఇచ్చే ఆస్కారం ఉండదనేది మరో కోణం. అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా స్క్రీనింగ్ కమిటీలు ఓకే చెప్పిన యాడ్స్ మాత్రమే ప్రచురించుకోవచ్చు. ఒకవేళ స్క్రీనింగ్ కమిటీల అనుమతి లేకుండా ప్రచురిస్తే ఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది.
సర్టిఫై చేస్తే ఓకే
ఇదివరకు ఎలాంటి నిబంధనలు లేకుండా పోలింగ్ నాడు, దానికి ఒక రోజు ముందు విరివిగా పొలిటికల్ యాడ్స్ ఇచ్చే సౌలభ్యం ఉండేది. కానీ తాజా నిబంధనల ప్రకారం ఇకపై అలాంటి ఛాన్స్ లేదు. స్క్రీనింగ్ కమిటీలు సర్టిఫై చేయని రాజకీయ ప్రకటనల ప్రచురణపై నిషేధం విధించామని ఈసీ స్పష్టం చేసింది.
ఇదివరకు పొలిటికల్ పార్టీలు ఇచ్చే యాడ్స్ పై ఎలాంటి నియంత్రణ లేదు. దాంతో ప్రకటనల ప్రచురణ ఇష్టారాజ్యంగా ఉండేది. అందుకే విద్వేషపూరితమైన లేదా రెచ్చగొట్టే యాడ్స్ వల్ల అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరోధించేలా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.