సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ నోటి దురుసు ఎంత పని చేసింది?
భోపాల్: జైలు జీవితం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా- ఆమె అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఆమెపై 72 గంటల పాటు నిషేధాన్ని విధించింది. ఈ 72 గంటల పాటు ప్రగ్యా సింగ్ ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. గురువారం తెల్లవారు జామున 6 గంటలకు ఈ నిషేధం అమల్లోకి వచ్చింది.
హేమంత్ కర్కరే..బాబ్రీ మసీదులే టార్గెట్ గా
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రగ్యాసింగ్ ఇటీవలే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబైపై ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో వారిని ధీటుగా ఎదుర్కొని, ప్రాణాలను వదిలిన మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక విభాగం చీఫ్ హేమంత్ కర్కరే, ఉత్తర్ ప్రదేశ్ లో బాబ్రీ మసీదు కూల్చివేత అంశాలను లక్ష్యంగా చేసుకుని ప్రగ్యాసింగ్ మాట్లాడారు. హేమంత్ కర్కరే మరెవరో కాదు. 2011లో కసబ్ నేతృత్వంలో ఉగ్రమూకలు మనదేశ ఆర్థిక రాజధాని ముంబైపై దాడి చేసి, మారణహోమాన్ని సృష్టించిన సందర్భంగా ఆయన అమరుడయ్యారు. ఉగ్రవాదులతో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఆయన కన్నుమూశారు.
హేమంత్ కర్కరేకు ఉసురు తగిలింది..
ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే ప్రాణం పోవడం వెనుక అసలు విషయం వేరే ఉందని ప్రగ్యాసింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాద నిరోధక దళం అధిపతిగా ఆయన ఎందరో అమాయకులను తీవ్ర వేధింపులకు గురి చేసి ఉంటారని, వారి ఉసురు తగిలే హేమంత్ కర్కరే అర్ధాంతరంగా మరణించారని అన్నారు. అలాగే- 1992లో చారిత్రాత్మక బాబ్రీ మసీదు కూల్చివేతలో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నానని చెప్పారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొనడం తనకు గర్వకారణమని అన్నారు.
కాంగ్రెస్ ఫిర్యాదు..
ఆమె చేసిన ఈ రెండు వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపాయి. ఎప్పుడెప్పుడా అని కాచుకుని కూర్చన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఇలాంటి ప్రకటనలు, వ్యాఖ్యలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తాయని ఫిర్యాదు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించింది కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం. ఈ రెండింటినీ ఉటంకిస్తూ- ప్రగ్యాసింగ్ కు నోటీసులను జారీ చేసింది. 72 గంటలు పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధాన్ని విధించింది.
క్షమాపణలు చెప్పినా..
తాను చేసిన తప్పు నిదానంగా ప్రగ్యాసింగ్ కు తెలిసి వచ్చినట్టుంది. తాను పొరపాటుగా ఈ వ్యాఖ్యలు చేశానని, ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ఆమె కోరారు. తాను ఉద్దేశపూరకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచార సభల్లో కాకతాళీయంగానే తాను ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు. అప్పటికే- జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది.
డిగ్గీ రాజాపై పోటీకి సై
మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుడు కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొన్న ప్రగ్యా సింగ్ గత ఏడాది జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమె భారతీయ జనతాపార్టీలో చేరారు. చేరిన వెంటనే- ఆమెకు లోక్ సభ టికెట్ ను ఖాయం చేసింది పార్టీ అధిష్ఠానం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆమె మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు. కాంగ్రెస్ బిగ్ షాట్ దిగ్విజయ్ సింగ్ పై ఆమె కాలు దువ్వుతున్నారు.