బెంగళూరులోని జయనగర ఎన్నికల డేట్ ఫిక్స్, బీజేపీ సీటు కోసం పోటీ, సీఎం యడ్యూరప్ప !
బెంగళూరు: బెంగళూరు నగరంలోని జయనగర శాసన సభ నియోజక వర్గం ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జయనగర బీజేపీ శాసన సభ్యుడు బిఎన్. విజయ్ కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో ఆ నియోజక వర్గం ఎన్నికలు వాయిదా పడ్డాయి.
జాన్ 11 పోలింగ్
జయనగర శాసన సభ ఎన్నికలు జూన్ 11వ తేదీ జరగనుంది. కౌంటింగ్ జూన్ 16వ తేదీన జరుగుతుందని ఎన్నికల కమీషన్ ప్రకటించింది. మే 18వ తేదీ నుంచి జయనగర శాసన సభ నియోజక వర్గంలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు సమర్పించడానికి అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
బీజేపీ అభ్యర్థి ఎవరు !
జయనగర శాసన సభ నియోజక వర్గం నుంచి కర్ణాటక మాజీ హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. అయితే జయనగరలో బీజేపీ ఇంత వరకు అధికారికంగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు.
ఆర్ఆర్ నగర ఎన్నికలు
రాజరాజేశ్వరినగర (ఆర్ ఆర్ నగర) శాసన సభ నియోజక వర్గంలోని జాలహళ్ళిలోని అపార్ట్ మెంట్ లో 9,000 కు పైగా ఓటరు గుర్తింపు కార్డులు బయటపడటంతో అక్కడ ఎన్నికలు వాయిదాపడ్డాయి. మే 28వ తేదీ రాజరాజేశ్వరి నగరలో పోలింగ్ జరుగుతుందని, మే 31వ తేదీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
బీజేపీ లీడర్స్
జయనగరలో బీజేపీ టిక్కెట్ ను స్థానిక కార్పొరేటర్లు ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఆచితూచి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంది. బీజేపీ అధికారంలో ఉండాలంటే ప్రతి ఎమ్మెల్యే సీటు ఎంతో విలువైనది కాబట్టి ఇప్పటి నుంచి జయనగర అభ్యర్థి ఎంపిక విషయంలో నాయకులు చర్చలు మొదలు పెట్టారు.