మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఎన్నికల నోటిఫికేషన్ నేడే ? వ్యూహాల్లో రాజకీయ పార్టీలు
మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నేడు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది . దీంతో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లల్లో అసెంబ్లీ ఎన్నికల భేరీ మోగనుంది . అయితే మొదట ఈ నెల 19వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని భావించినప్పటికీ, నిన్న నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఎన్నికల కమిషన్. దీంతో నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్న మూడు రాష్ట్రాల్లోనూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. ఇక ఈ ఎన్నికలు తాజాగా దేశ పరిస్థితుల దృష్ట్యా బిజెపి కి సవాల్ అనే చెప్పాలి. మరోపక్క ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో తన సత్తా చాటాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మూడు రాష్ట్రాల్లో అధికార పీఠాన్ని దక్కించుకోవడం కోసం ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నేడు వెలువడనుంది అని భావిస్తున్న నేపథ్యంలో మొత్తం ఎన్నికల ప్రక్రియ డిసెంబరు లోపు ముగిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మొదటి మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రెండు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జార్ఖండ్ ఎన్నికల నిర్వహిస్తారని భావిస్తున్నారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో జార్ఖండ్ ఎన్నికల పోలింగ్ దశలవారీగా నిర్వహించనున్నట్లు గా భావిస్తున్నారు. ఏది ఏమైనా నేడు నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి.