ఈ సారి కుమారస్వామి వంతు! హెలికాప్టర్ లో తనిఖీలు..లగేజీనీ వదల్లేదు!
బెంగళూరు: జనతాదళ్ (సెక్యులర్) అధినేత, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామిపై ఎన్నికల అధికారులు డేగకన్ను వేశారా?. ఆయన నిర్వహిస్తోన్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై గట్టి నిఘా ఉంచారా? కుమారస్వామి కదలికలను అనుక్షణం పసిగడుతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా పార్టీల అగ్ర నాయకులు పెద్ద మొత్తంలో డబ్బులను తరలించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఉండటంతో.. ఇదివరకు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప హెలికాప్టర్ ను ఎన్నికల అధికారులుతనిఖీ చేసిన విషయం తెలిసిందే.
ఈ సారి కుమారస్వామి వంతు వచ్చింది. ఎన్నికల ప్రచారం కోసం కుమారస్వామి వినియోగిస్తున్న హెలికాప్టర్ ను అధికారులు తనిఖీ చేశారు. కుమారస్వామి వెంట ఉన్న లగేజీనీ వదల్లేదు. కొద్దిరోజుల కిందట కుమారస్వామి కారును ఎన్నికల సిబ్బంది తనిఖీ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే మాజీ ప్రధాని దేవేగౌడ కారును, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప హెలికాప్టర్ ను పరిశీలించారు. తాజాగా- కుమారస్వామి హెలికాప్టర్ లో సోదాలు నిర్వహించారు. ఉత్తర కన్నడ జిల్లాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా.. రెండో దశలో 14 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మిగిలిన 14 సీట్లల్లో మూడో దశ కింద ఈ నెల 23న ఓటింగ్ నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో.. కర్ణాటక ఉత్తర ప్రాంతంలోని 14 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం యథావిధిగా కొనసాగుతోంది. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కుమారస్వామి ఉత్తర కన్నడ జిల్లాకు చేరుకోగా.. ఎన్నిక అధికారులు తనిఖీ చేశారు. కుమారస్వామి తన వెంట తెచ్చుకున్న లగేజీ సహా హెలికాప్టర్ ను క్షుణ్నంగా పరిశీలించారు.