పంజాబ్ లో 48 కేంద్రాల్లో 9న రీపోలింగ్ : ఎలక్షన్ కమిషన్ ఆదేశం
చండీగఢ్
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని 48 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ మంగళవారం ఆదేశించింది. ఐదు నియోజక వర్గాల పరిధిలోని ఈ పోలింగ్ కేంద్రాలలో ఫిబ్రవరి 9న రీపోలింగ్ నిర్వహించనున్నారు.
పంజాబ్ లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 4న ఎన్నికలు జరిగాయి. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తిన కారణంగా పోలింగ్ నిలిచిపోయింది.
ఇలా పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 48 కేంద్రాల్లో ఓటింగ్ నిలిచిపోగా, తిరిగి ఈ కేంద్రాలలో పోలింగ్ నిర్వహించాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపును మార్చి 11న నిర్వహించనున్నారు.
రీపోలింగ్ నిర్వహించే పోలింగ్ కేంద్రాలు మజిత, మొగ, ముక్తసర్, సర్దులగఢ్, సంగ్రూర్ ప్రాంతాల్లో ఉన్నాయి. మరోవైపు ఫిబ్రవరి 4న జరిగిన పోలింగ్ కు సంబంధించి ఈవీఎంలు పనిచేయకపోవడానికి దారితీసిన పరిస్థితులు, వాటిలో ఏర్పడిన లోపాలకు సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఎలక్షన్ కమిషన్ కోరింది.