జమిలి ఎన్నికలకు రెడీ- పార్లమెంటు నిర్ణయమే తరువాయి-సీఈసీ సునీల్ అరోరా
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మద్దతు కూడా లభించింది. జమిలి ఎన్నికల నిర్వహణకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని గతంలో కేంద్రం ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనిపై ఇవాళ స్పందించిన సీఈసీ సునీల్ అరోరా ఈ ప్రతిపాదనకు తన మద్దతు తెలిపారు. దీంతో జమిలి ఎన్నికల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని ఈయన చెప్పినట్లయింది.
పార్లమెంటుతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని గతంలో ఎన్నికల సంఘాన్ని కూడా కోరింది. దేశంలో నిరంతరం ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని ప్రధాని మోడీ గతంలోనే తెలిపారు. దీంతో 2022లో జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని స్పష్టమైంది. ఆ తర్వాత కూడా ప్రధాని జమిలి ఎన్నికలను పరిశీలిస్తున్నట్లు బహిరంగానే చెప్పారు.
ప్రధాని మోడీ కోరుతున్న విధంగానే దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిధ్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల ఛీఫ్ కమిషనర్ సునీల్ అరోరా ఇవాళ ప్రకటించారు. జమిలి ఎన్నికల కోసం ఒకే ఓటర్ల జాబితాతో పాటు ఇతర ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పార్లమెంటులో చట్ట సవరణ జరిపి నిర్ణయం తీసుకుంటే జమిలి ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని అరోరా తెలిపారు. దీంతో జమిలి ఎన్నికలు ఖాయమనే వాదనకు బలం చేకూరుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కేంద్రంలోని బీజేపీకి మద్దతిస్తున్న పలు రాష్ట్రాలు కూడా జమిలి ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాయి. దీంతో కేంద్రం త్వరలో దీనిపై ఓ నిర్ణయం ప్రకటించే అవకాశముంది.
Recommended Video
2015లోనే సుదర్శన్ నాచియప్పన్ నేతృత్వంలోని వ్యక్తిగత, ప్రజా ఫిర్యాదులు, లా అండ్ జస్టిస్కు సంబంధిచిన పార్లమెంటు స్ధాయీ సంఘం దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి సూచించింది. 2018లో లా కమిషన్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపింది. అయితే కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు జమిలి ప్రతిపాదనపై పెదవి విరుస్తున్నాయి. ఇది ఆచరణ సాధ్యం కాదని తేల్చిచెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం, సీఈసీ తీసుకోబోయే నిర్ణయాలపై ఉత్కంఠ పెరుగుతోంది.