ఎన్నికల్లో అఫిడవిట్లపై ఈసీ కీలక నిర్ణయం ... అభ్యర్ధులకు ఇక కష్టాలే- వారికి ఊరట...
దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు షాక్ ఇచ్చే నిర్ణయాన్ని కే్ంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. ఎన్నికల అక్రమాలను, ప్రజలను తప్పుదోవ పట్టించే అభ్యర్ధులకు చుక్కలు చూపించేలా ఉన్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో నిజాయితీగా పోటీ చేసే అభ్యర్ధులకు ఊరటనిచ్చేలా ఉంది.
ఏపీలో జూలై 6న ఎమ్మెల్సీ ఎన్నిక - మండలి రద్దు పెండింగ్ లో ఉన్నా- వైసీపీ అభ్యర్ధిగా డొక్కా ?
అఫిడవిట్ల అక్రమాలు...
దేశవ్యాప్తంగా జరిగే ఏ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి అయినా తనకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర వంటి ఎన్నో అంశాలను నామినేషన్ వేసే సందర్భంగా బయటపెట్టాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఎన్నికల సంఘం సదరు అభ్యర్ధి ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హుడా కాదా అన్న అంశాన్ని నిర్ధారిస్తుంది. అదే సమయంలో తనకు ఓటు వేయబోయే ఓటర్లు కూడా ఈ సమాచారం ఆధారంగానే చాలా సందర్భాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో చాలా సార్లు అభ్యర్ధులు ఎన్నికల సందర్భంగా దాఖలు చేసే అఫిడవిట్లలో అసలైన సమాచారాన్ని, తమ నేరచరిత్రను, ఆస్తులను కూడా దాచిపెట్టి పోటీ చేసేస్తున్నారు.
పోటీ చేసి గెలిచాక....
ఎన్నికల్లో అభ్యర్ధులు పోటీ చేసి గెలిచిన తర్వాత వారి ప్రత్యర్ధులుగా ఉన్నవారు ఈ అఫిడవిట్లలో సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వీరిని అనర్హులుగా ప్రకటించాలని న్యాయస్ధానాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎన్నికల సంఘం పాత్ర ప్రశ్నార్ధకంగా మారుతోంది. కోర్టులు కూడా తప్పుడు అఫిడవిట్లపై ఓ సమగ్ర విధానం రూపొందించాలని, కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చాలా సార్లు ఎన్నికల సంఘాలకు ఆదేశాలు ఇస్తున్నాయి. దీంతో ఎన్నికల సంఘం దీనిపై సమగ్రంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకుంది.
తప్పుడు అఫిడవిట్లపై క్రిమినల్ చర్యలే...
ఇకపై ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు సమర్పించే అఫిడవిట్లను ఎన్నికల సంఘం, రిటర్నింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నామినేషన్ల సమయంలోనే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటారు. తేడా వచ్చినట్లు తేలితే వారిపై తామే క్రిమినలే కేసులు నమోదు చేయబోతున్నారు. ప్రాధమిక దర్యాప్తు తర్వాత కేసు తీవ్రతను బట్టి వివిధ దర్యాప్తు సంస్ధలకు ఎన్నికల సంఘమే ఇలాంటి కేసులను రిఫర్ చేయబోతోంది. దీంతో ఇప్పటివరకూ అక్రమాలకు పాల్పడిన అభ్యర్ధులు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే.
Recommended Video
నిజాయితీపరులకు ఊరట...
ఎన్నికల్లో నిజాయితీగా పోటీ చేసే వారికి అక్రమార్కుల ఆగడాలు చాలా సందర్భాల్లో ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. తప్పుడు సమాచారాన్ని పొందుపరచడం ద్వారా అక్రమార్కులు నిజాయితీగా పోటీ చేసే ఎందరో అభ్యర్ధుల అవకాశాలను దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘం తీసుకున్న క్రి్మినల్ చర్యల నిర్ణయం వారికి ఎంతో ఊరట నివ్వబోతోంది. అలాగే గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయాక నామినేషన్ల అఫిడవిట్లలో సమాచారంపై ప్రత్యర్ధులు న్యాయస్ధానాలను ఆశ్రయించాల్సిన అవసరం కూడా తప్పినట్లవుతుంది. దీంతో ఎన్నికల సంఘం తీసుకున్న తాజా నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.