ఎన్నికల వేళ సర్వేల గోల: ఒక సర్వే కాంగ్రెస్ అంటే.. మరో సర్వే బీజేపీ అంటోంది ఇంతకీ ఓటరు ఎటువైపు?
Recommended Video
దేశంలోని ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో సర్వేలు తమ ఫలితాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒక సర్వే బీజేపీ తిరిగి పగ్గాలు చేపడుతుందని చెబుతుండగా మరికొన్ని సర్వేలు ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో పాగా వేయనుంది అని జోస్యం చెబుతున్నాయి. దీంతో అసలు ట్రెండ్ ఎలా ఉందో తెలియక రాజకీయ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. తాజాగా సీ ఓటర్ నిర్వహించిన సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొంది. ఇదిలా ఉంటే మిజోరాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మాత్రం స్పష్టమైన మెజార్టీ ఏపార్టీకి ఇవ్వలేదు.
తెలంగాణలో కేసీఆర్ గ్రాఫ్ పెరిగిందంటున్న సర్వే..ఎవరు చేశారు..? ఏమా కథ
రాజస్థాన్లో వసుంధర రాజేకు వ్యతిరేక పవనాలు
రాజస్థాన్లో ప్రజలు ఒకసారి ఒక పార్టీకి అధికారం కట్టబెడితే మరో సారి మరో పార్టీకి అధికారం ఇస్తారు. ఇదే ఈ సారి బీజేపీకి సంకటంగా మారింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఓటమి ఖాయమని సర్వే తేల్చేసింది. కాంగ్రెస్కు 145 సీట్లు వస్తాయని వెల్లడించింది. మరోవైపు బీజేపీ 45 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందంటూ జోస్యం చెప్పింది సీఓటర్ సర్వే.ఇక ఓట్ల శాతం చూస్తూ కాంగ్రెస్కు 47.9శాతం, బీజేపీకి 39.7శాతం వచ్చాయి.
మధ్యప్రదేశ్లో భిన్నంగా ఉన్న సర్వే ఫలితాలు
ఇక మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ 15 ఏళ్ల పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారని సర్వే వెల్లడించింది. ఈ సారి బీజేపీ 166 స్థానాల నుంచి 107 స్థానాలకు పడిపోతుందని చెప్పింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 116 సీట్లతో అధికారంలోకి వస్తుందని వెల్లడించింది. ఇది సీ ఓటర్ సర్వే ఫలితాలు కాగా... మరో సర్వే టైమ్స్నౌ-సీఎన్ఎక్స్ సర్వే మాత్రం మధ్యప్రదేశ్లో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించింది. టైమ్స్ నౌ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్లో బీజేపీకి 122 సీట్లు వస్తాయని వెల్లడించింది. ప్రభుత్వం ఏర్పాటుకు 116 సీట్లు కావాల్సిఉండగా ఆరు సీట్లు ఎక్కువగానే వస్తున్నాయని పేర్కొంది.
తెలంగాణలో అధికారంలోకి ప్రజాకూటమి: సీఓటర్ సర్వే
ఇక తెలంగాణ విషయానికొస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి 64 సీట్లతో అధికారంలోకి వస్తుందని సీఓటర్ సర్వే వెల్లడించింది. ఇక్కడ కాంగ్రెస్ 94 స్థానాల్లో పోటీ చేస్తోంది. తెలంగాణలో సీ ఓటర్ సర్వే ఇలా ఉంటే.. అదే సీఓటర్ ప్రముఖ జాతీయ మీడియా రిపబ్లిక్ టీవీతో కలిసి చేసిన సర్వేలోకూడా గులాబీ పార్టీకి శృంగభంగ తప్పదని తెలపింది. ఇదిలా ఉంటే మరో జాతీయ ఛానెల్ ఇండియా టుడే పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పీఎస్ఈ చేపట్టిన సర్వేలో ప్రజల మద్దతు కేసీఆర్కే ఉందని తెలిపింది. 75శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని చెప్పిన పీఎస్ఈ సర్వే వారంతా టీఆర్ఎస్ వైపే నిలుస్తున్నట్లు వెల్లడించింది.
ఛత్తీస్గఢ్లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ: సీఓటర్ సర్వే
ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుందని సీ ఓటర్ సర్వే వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో బీజేపీకి 43 సీట్లు వస్తుండగా అదే కాంగ్రెస్కు 41 సీట్లు వస్తాయని సర్వే జోస్యం చెప్పింది. సీ ఓటర్ సర్వే రెండు పార్టీల మధ్య హోరా హోరీ పోరు తప్పదని చెప్పగా... మరో సర్వే ఇండియా టుడే పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సంస్థ నిర్వహించిన సర్వేలో బీజేపీ సులభంగా గెలుస్తుందని తెలిపింది. అంతేకాదు అజిత్ జోగి జనతా కాంగ్రెస్ పార్టీ మాయావతి బీఎస్పీ పార్టీలు కలిసి పోటీ చేయడం బీజేపీకి కలిసి వస్తుందని పీఎస్ఈ సర్వే పేర్కొంది.