సీఎం మీద పోటీ చేస్తున్న ఎలెక్షన్ కింగ్, కలాం, మోడీ, వైఎస్ఆర్ ను వదల్లేదు, 191 సార్లు !
బెంగళూరు: భారత ఎన్నికల చరిత్రలో ఎలెక్షన్ కింగ్ అనే పిలుపించుకునే లిమ్కాబుక్ రికార్డు విజేత, తమిళనాడుకు చెందిన డాక్టర్ కే. పద్మరాజన్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సారి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద పోటీ చెయ్యడానికి మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజక వర్గంలో నామినేషన్ వేసిన డాక్టర్ కే. పద్మరాజన్ శాసన సభ ఎన్నికల బరిలో దిగారు.
నరేంద్ర మోడీకి చాలెంజ్
2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మీద డాక్టర్ కే. పద్మరాజన్ పోటీ చేశారు. దేశంలో ఎక్కడైనా సరే ప్రముఖులు ఎవరైనా పోటీ చేస్తే కచ్చితంగా డాక్టర్ కే. పద్మరాజన్ ఆ నియోజక వర్గంలో పోటీ చెయ్యడం అలవాటుగా మారిపోయింది.
191 సార్లు ఎన్నికల్లో పోటీ
తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరుకు చెందిన డాక్టర్ కే. పద్మరాజన్ హోమియోపతి వైద్యుడు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్ సభ, శాసన సభ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్, మునిసిపాలిటి, జిల్లా పంచాయితీ, తాలుకా పంచాయితీ, గ్రామ పంచాయితీ తదితర ఎన్నికల్లో ఇప్పటి వరకూ 191 సార్లు పోటీ చేశారు.
1988 నుంచి 2018 వరకు !
1988లో సీపీఎం మాజీ ఎమ్మెల్యే నవరంగ్ మీద మొదటి సారి డాక్టర్ కే. పద్మరాజన్ పోటీ చేశారు. తరువాత తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర చోట్ల పలువురు ప్రముఖుల మీద డాక్టర్ కే. పద్మరాజన్ పోటీ చేశారు.
వైఎస్ఆర్ ను వదల్లేదు
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పులివెందలలో వైఎస్. రాజశేఖర్ రెడ్డి మీద కూడా డాక్టర్ కే. పద్మరాజన్ పోటీ చేశారు. కర్ణాటకలో 1996లో సీ. నారాయణస్వామి మీద, 2004లో బీదర్, 2009లో మాజీ సీఎం హెచ్ డి. కుమారస్వామి మీద, 2013లో మాజీ సీఎం జగదీష్ శెట్టర్ మీద డాక్టర్ కే. పద్మరాజన్ పోటీ చేశారు.
ఒక్కసారి డిపాజిట్
191 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ కే. పద్మరాజన్ ఇప్పటి వరకూ దాదాపు రూ. 15 లక్షల వరకూ ఎన్నికల్లో ఖర్చు చేశారు. ఎన్నికల కమిషన్ కు డిపాజిట్ గా కట్టిన మొత్తం ఒక్కసారి కూడా తిరిగిరాలేదు. తాను ఎన్నికల ప్రచారం చెయ్యనని, గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నానని డాక్టర్ కే. పద్మరాజన్ అంటున్నారు. ఏ ఎన్నికల్లో తనకు ఇంత వరకూ డిపాజిట్ వెనక్కిరాలేదని, ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో డిపాజిట్ వెనక్కి వచ్చిందని డాక్టర్ కే. పద్మరాజన్ అంటున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలు
రాష్ట్రపతి ఎన్నికల్లో 1997లో కేఆర్. నారాయణ, 2002లో ఎపీ.జే. అబ్దుల్ కలాం, 2007లో ప్రతిభా పాటిల్, 2012లో ప్రణబ్ ముఖర్జీ మీద డాక్టర్ కే. పద్మరాజన్ పోటీ చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో 1997, 2002, 2007, 2012లో డాక్టర్ కే. పద్మరాజన్ పోటీ చేశారు.
సొంత వ్యాపారం
తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరుకు చెందిన డాక్టర్ కే. పద్మరాజన్ స్వతహాగా హోమియోపతి వైద్యుడు. డాక్టర్ కే. పద్మరాజన్ టైర్ రీమోల్డింగ్ వ్యాపారం చేస్తున్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేస్తున్న డాక్టర్ పద్మరాజన్ ఎన్నికల ప్రచారం మాత్రం చెయ్యరు. గిన్నీస్ బుక్ రికార్డు లక్షంగా డాక్టర్ కే. పద్మరాజన్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఎలెక్షన్ కింగ్ అనే పేరు సంపాధించుకున్నారు.