రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికకు మోగిన నగారా...సభలో బలబలాలు ఇవే..!
రాజ్య సభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికకు నగారా మోగింది. ఈ వర్షాకాలంలోనే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎంపిక జరగనుంది. ఈ నెల 9న ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనున్నట్లు ఛైర్మెన్ వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికల నేపథ్యంలో హస్తినలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నాలు చేయాలని విపక్షపార్టీలు నిర్ణయించాయి. బీజేపీ అభ్యర్థిని ఓడించడంతో పాటు విపక్షాల కూటమి బలపడడానికి విపక్షాల తరపున ఏ అభ్యర్థికైనా సరే మద్దతు ప్రకటించేందుకు సిద్ధమైంది కాంగ్రెస్.
ఉపసభాపతి ఎన్నికకు 245 మంది రాజ్యసభ సభ్యులు ఓటింగ్లో పాల్గొని తమ ఓటును వినియోగించుకోనున్నారు. డిప్యూటీ ఛైర్మెన్ పదవి చేజిక్కించుకోవాలంటే అభ్యర్థికి 122 మంది సభ్యుల బలం అవసరం అవుతుంది. ప్రస్తుతం రాజ్యసభలో అన్నాడీఎంకేకు 13 మంది, టీఆర్ఎస్ ఆరుగురు సభ్యులతో కలిపి ఎన్డీఏ బలం 109కి చేరింది.
భారతీయ జనతా పార్టీ రాజ్య సభ సభ్యుల బలం 73గా ఉంది. ఇటీవలే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన ఆరుగురు టీడీపీ సభ్యులతో కలిసి ప్రస్తుతం ప్రతిపక్షాల సంఖ్యా బలం 110గా ఉంది. ఉపసభాపతి ఎన్నిక విషయంలో మ్యాజిక్ ఫిగన్ 122కి అవసరమైన బలం తమకు లేకపోవడంతో బీజేడీ, శివసేన, ఆరుగురు ఇండిపెండెంట్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార బీజేపీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.ప్రస్తుతం రాజ్యసభలో బీజేడీకి 9 మంది సభ్యులు, శివసేనకు ముగ్గురు సభ్యులు ఉండడంతో రెండు పార్టీల నిర్ణయమే కీలకంగా మారనుంది.
రాజ్యసభ ఉపసభాపతి పీజే కురియన్ పదవీకాలం ముగియడంతో ఎన్డీఏ అభ్యర్థిని రంగంలోకి దించి ఆ స్థానాన్ని దక్కించుకోవాలని కమలదళం పెద్దలు పావులు కదుపుతున్నారు. సభలో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఎన్డీఏ తరపున మిత్రపక్షానికి చెందిన శిరోమణి అకాలీదళ్ నేత నరేష్ గుజ్రాల్ కానీ జేడీయూకి చెందిన హరివంశ్ను నిలబెడితే ఇతర పార్టీల మద్దతు కూడా ఉంటుందనే వ్యూహంతో బీజేపీ ముందుకు వెళుతోంది. మరోవైపు పీజే కురియన్ వీడ్కోలు సమావేశంలో డిప్యూటీ ఛైర్మన్ ఎంపికలో అధికార, విపక్షాలు కలిసి కురియన్ లాంటి సమర్థవంతమైన వ్యక్తిని ఎన్నుకోవాలని రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు సూచించారు.
ఏకాభిప్రాయం కోసం బిజూ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతో బీజేపీ పెద్దలు చర్చలు జరుపుతున్నారు.26ఏళ్ళ క్రితం అంటే 1992లో డిప్యూటీ ఛైర్మెన్ పదవి కోసం చివరిసారిగా జరిగిన ఎన్నికలు జరిగాయి.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుకేందు శేఖర్ను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ అభ్యర్థిగా నిలిపేందుకు టీఎంసీ యత్నిస్తోంది. రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా టీఎంసీ ఉంది. బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలతో ఏకం కావాలనుకుంటున్న కాంగ్రెస్, టీఎంసీ నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సభ్యుల బలం 50, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుల బలం 13, సమాజ్ వాదీ పార్టీకి 13 మంది సభ్యులుండగా.. జేడీయూ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు ఒక్కో పార్టీ నుంచి 6మంది సభ్యులున్నారు. సీపీఎం, ఆర్జేడీ నుంచి ఐదేసి మంది సభ్యులున్నారు. బీఎస్పీ, డీఎంకే, ఎన్సీపీ పార్టీలకు ఒక్కో పార్టీకి నలుగురు సభ్యులు పెద్దల సభలో ఉన్నారు.