కైరానా సహా రెండింట దెబ్బతిన్న బీజేపీ, యోగికి నూర్పూర్ షాక్: 10 స్థానాలకు బీజేపీ గెలిచింది ఒక్కటే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరిగిన 4 లోకసభ, 10 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు, ఆర్ఆర్ నగర్ ఎన్నికలో బీజేపీకి ఎదురుగాలి వీచింది. పలు సిట్టింగ్ స్థానాలను ప్రతిపక్షాలకు కోల్పోయింది. 2014 తర్వాత బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తుంది. అయితే ఉప ఎన్నికల్లో మాత్రం సత్తా చాటడం లేదు. ఇప్పుడు అది మరోసారి రిపీట్ అయింది. 4 లోకసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీ ఒక స్థానాన్ని నిలుపుకుంది.
బీజేపీకి కాంగ్రెస్ దెబ్బకు దెబ్బ: ఉపఎన్నిక గెలుపుతో సీన్ రివర్స్, మేఘాలయలో కర్ణాటక రిపీట్?
మిగతా రెండు చోట్ల ప్రతిపక్షాలు గెలిచాయి. ఓ చోట బీజేపీ మిత్రపక్షం గెలిచింది. మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలు కాగా, ఇందులో ఒక స్థానాంలోనే గెలిచింది. మిగతా రెండు స్థానాల్లో ఓడిపోయింది. కీలకమైన యూపీలో మరో సీటు కోల్పోయింది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో గతంలో రెండు లోకసభ స్థానాలు కోల్పోగా, ఇప్పుడు కైరానా లోకసభ, నూర్పూర్ అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయింది.
బాంద్రా - గోండియాలో ఎన్సీపీ గెలుపు
4 లోకసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలోని బాంద్రా - గోండియాలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ - ఎన్సీపీలు మేజర్ ఎన్నికల్లో తొలిసారి కలిశాయి. ఇక్కడ ఎన్సీపీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతిచ్చింది. ఎన్సీపీ తరఫున యశ్వంతరావు, బీజేపీ తరఫున హేమంత్ పట్లే బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిపై ఎన్సీపీ విజయం సాధించింది.
బీజేపీ నిలుపుకున్న సీటు పాల్ఘర్ ఒక్కటే
మహారాష్ట్రలోని పాల్ఘర్లో మాత్రం బీజేపీ అభ్యర్థి శివసేన అభ్యర్థిపై గెలుపొందారు. బీజేపీ నేత గవిట్ రాజేంద్ర శివసేన అభ్యర్థి శ్రీనివాస్ వనగపై విజయం సాధించారు. బీజేపీ నిలుపుకున్న లోకసభ స్థానం ఇదొక్కటే.
నాగాలాండ్లో బీజేపీ గెలుపు
నాగాలాండ్ లోకసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షం ఎన్డీపీపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి టోఖేహో ఎన్పీఎఫ్ అభ్యర్థి సీ అపోక్ జమీర్ పైన భారీ మెజార్టీతో గెలుపొందారు.
కైరానాలో నాలుగు పార్టీలు కలవడంతో బీజేపీకి దెబ్బ
బీజేపీ గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు గాను డైబ్బైకి పైగా లోకసభ సీట్లు గెలిచింది. కానీ ఆ తర్వాత ఉప ఎన్నికల్లో లోకసభ స్థానాలు కోల్పోతుంది. గతంలో యూపీ సీఎం, డీప్యూటీ సీఎం స్థానాలను కోల్పోయింది. ఇప్పుడు కైరానా సీటును ఆర్ఎల్డీకి కోల్పోయింది. ఇది కూడా నిన్నటి వరకు బీజేపీ సిట్టింగ్ స్థానం. ఇక్కడ ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుం గెలుపొందారు.
ఆర్ఆర్ నగర్లో కాంగ్రెస్ సత్తా
కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్ ఎన్నికల్లో బీజేపీ రెండోస్థానంతో సరిపెట్టుకుంది. జేడీఎస్తో మిత్రపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న నాయుడుకు 1,08,064 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి మునిరాజు గౌడకు 82,572 ఓట్లు వచ్చాయి. జేడీఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
10 అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలు ఇలా
ఉప ఎన్నికలు జరిగిన 10 అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే 1.బీహార్లోని జోహికాట్లో బీజేపీ మిత్రపక్షం జేడీయూ అభ్యర్థి ముర్షీత్ ఆలమ్పై ఆర్జేడీ అభ్యర్థి షాహన్వాజ్ గెలుపొందారు. 2. జార్ఖండ్లో జేఎంఎం అభ్యర్థి సీమాదేవీ గెలుపొందారు. 3. జార్ఖండ్లో మరో సీటు గోమియాలో జేఎంఎం అభ్యర్థి బబితా దేవి గెలిచారు. 4.కేరళలోని చెంగనూర్లో సీపీఎం తన సీటును నిలబెట్టుకుంది. 5. మహారాష్ట్రలోని పలూస్ - ఖడేగోన్లో కాంగ్రెస్ అభ్యర్థి విశ్వజీత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 6. మేఘాలయలోని అంపతిలో కాంగ్రెస్ అభ్యర్థి మియాని డి షిరా ఎన్పీపీ అభ్యర్థిపై గెలిచారు. 7. పంజాబ్లోని షాకోట్లో కాంగ్రెస్ అభ్యర్థి హరదేవ్ సింగ్ అకాలీదళ్ అభ్యర్థిపై గెలిచారు. 8. ఉత్తరాఖండ్లోని తరాలీలో బీజేపీ అభ్యర్థి మున్ని దేవి షా కాంగ్రెస్ అభ్యర్థి జీత్ రామ్పై గెలిచారు. 9. యూపీలోని నూర్పూర్లో ఎస్పీ అభ్యర్థి నయీమ్ ఉల్ హసన్ బీజేపీ అభ్యర్థి అవినీష్ సింగ్పై గెలిచారు. 10. బెంగాల్లోని మహేస్తలలో తృణమూల్ అభ్యర్థి దులాల్ చంద్ర దాస్ సీపీఎం అభ్యర్థిపై గెలిచారు. మొత్తంగా చూస్తే బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు అన్ని ఏకం కావడంతో ఆ పార్టీ రెండు లోకసభ స్థానాలను కోల్పోయింది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే బెంగాల్, కేరళ, కర్ణాటక, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఇతర పక్షాలు అధికారంలో ఉండటం, వారి సీట్లు కాపాడుకోవడం జరిగింది. అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కోల్పోయింది కీలకమైన నూర్పూర్ మాత్రమే. పరిశీలిస్తే మిగతా స్థానాల్లో బీజేపీకి పెద్దగా ప్రాబల్యం లేదని చెప్పవచ్చు.