మొన్న సిబల్,నిన్న చిదంబరం... కాంగ్రెస్లో అలజడి... గ్రౌండ్లో ఆ పార్టీ ఉనికిని కోల్పోతుందా?
సంస్థాగత లోపాలను సరిదిద్దుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం అసాధ్యమంటూ ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్లు ఒంటికాలిపై లేచారు. నచ్చకపోతే ఇంకో పార్టీ చూసుకోండని కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి కపిల్ సిబల్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు సిబల్కు మరో గొంతు తోడైంది. కాంగ్రెస్ పార్టీపై ఎప్పుడూ ఏ విమర్శలు వచ్చినా తిప్పికొట్టే చిదంబరం సైతం... పార్టీ వ్యవహారంపై పెదవి విరిచారు. కపిల్ సిబల్ వాదనకు బలం చేకూర్చేలా... క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నిజంగానే బలహీనపడిందని పేర్కొన్నారు.
నచ్చకపోతే వెళ్లిపోండి... లేదా కొత్త పార్టీ పెట్టుకోండి... సిబల్పై కాంగ్రెస్ నేత షాకింగ్ కామెంట్స్
చిదంబరం ఏమన్నారు...
'గుజరాత్,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు నాకు బాధ కలిగించాయి. దీన్నిబట్టి క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనపడినట్లు లేదా సంస్థాగత ఉనికిని కోల్పోయినట్లు కనిపిస్తోంది. నిజానికి బిహార్లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి గెలవాల్సింది. కానీ విజయానికి దగ్గరిదాకా వచ్చి ఎందుకు ఆగిపోయినట్లు అన్నదానిపై సమగ్రమైన చర్చ జరగాలి. కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్గఢ్,జార్ఖండ్లలో గెలిచి ఎక్కువ కాలమేమీ అవట్లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.' అని చిదంబరం వ్యాఖ్యానించారు.
తక్కువ సీట్లలో పోటీ చేయాల్సింది...
సంస్థాగతంగా బలమైన పునాది ఉంటే చిన్న పార్టీలు కూడా ఎన్నికల్లో రాణించవచ్చునని ఎంఐఎం,సీపీఐ-ఎంఎల్ నిరూపించాయని చిదంబరం పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాని బలానికి మించి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిందన్నారు. 'గత 20ఏళ్లుగా బీజేపీ,దాని మిత్రపక్షాలకు కంచుకోటగా ఉన్న 25 సీట్లను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఆ సీట్లను పార్టీ తిరస్కరించాల్సింది. కేవలం 45 స్థానాల్లో మాత్రమే పార్టీ పోటీ చేసి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా కింది స్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.' అని చిదంబరం అభిప్రాయపడ్డారు.
ఇక 'కాంగ్రెస్' పని అయిపోయినట్లేనా..? ప్రజలకు పార్టీ దూరమైందా..? కపిల్ సిబల్ బిగ్ బాంబ్...
Recommended Video
నాయకత్వంపై ఇలా...
మున్ముందు కేరళ,తమిళనాడు,పుదుచ్చేరి,బెంగాల్,అసోం ఎన్నికలు రాబోతున్నాయి... చూద్దాం కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయో...' అని చిదంబరం పేర్కొన్నారు. ఇక పార్టీ నాయకత్వ బాధ్యతల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ... ఏఐసీసీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకోబడుతారో తాను చెప్పలేనన్నారు. అదే సమయంలో అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడవచ్చునని అన్నారు. నిన్నటిదాకా కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ల అభిప్రాయాన్ని బట్టి... ఆ పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్న వాదన మాత్రం బలంగా వినిపిస్తోంది.