మాజీ జవాన్ తేజ్ బహదూర్కు సుప్రీం షాక్..
ఢిల్లీ : మాజీ బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. తన నామినేషన్ను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించడంపై దాఖలు చేసిన పిటీషన్ను కోర్టు కొట్టివేసింది. పిటీషన్పై వాదనలు వినేందుకు ఎలాంటి బలమైన కారణాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎలక్షన్ పిటీషన్లు దాఖలు చేస్తే అది ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపుతుందని ఈసీ వాదించింది. సుప్రీంకోర్టు గత తీర్పుల్ని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేదీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన యాదవ్ తరఫు న్యాయవాది ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ పిటీషన్లు దాఖలు చేయవచ్చన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను ప్రస్తావించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణయోగ్యం కాదంటూ తేజ్ బహదూర్ పిటీషన్ను కొట్టివేసింది.
సైన్యం నుంచి బహిష్కరణకు గురైన తేజ్ బహదూర్ యాదవ్ వారణాసి లోక్సభ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే ఆర్మీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్ బహదూర్ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించని కారణంగా ఎన్నికల సంఘం ఆయన నామినేషన్ను తిరస్కరించింది. దీనిపై మాజీ జవాను సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు చుక్కెదురైంది.
పౌరసత్వం కేసులో రాహుల్కు రిలీఫ్... పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్ట్..