ప్రజాస్వామ్యానికి పండుగరోజు: నాటి ఫలితాలు పునరావృతం కావాలి: మోడీ
న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందనను వెలిబుచ్చారు. ప్రజాస్వామ్యానికి అసలైన పండుగగా భావించే ఎన్నికల మహోత్సవం వచ్చేసిందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు చురుగ్గా భాగస్వామ్యులు కావాలని కోరారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రత్యేకించి- కొత్తగా ఓటు వేయడానికి సిద్ధపడ్డ యువత రికార్డు స్థాయిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అయిదేళ్లలో మూడుసార్లు సర్జికల్ స్ట్రైక్స్: మనకు తెలిసినవి రెండే: ఆ ఒక్కటీ అడగొద్దు
ఎన్నికల సంఘం సార్వత్రిక పోలింగ్ ను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తోందని ప్రశంసించారు. ఈ సారి కూడా అదే సమర్థతతో పని చేయాలని అన్నారు. పోలింగ్ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేయాలని మోడీ.. భద్రతా బలగాలను కోరారు. 2014 ఎన్నికల్లో దేశ ప్రజలు ఏకపక్షంగా ఓటు వేశారని గుర్తు చేశారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, పథకాలకు ఓటుతో సమాధానం చెప్పారని అన్నారు. అదే తరహా తీర్పు పునరావృతం కావాలని అకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అన్ని రాజకీయ పార్టీలు, అన్ని పార్టీల అభ్యర్థులకు మోడీ.. తన శుభాకాంక్షలను తెలియజేశారు. తమ దారులు వేరైనప్పటికీ.. ప్రతి పౌరుడి అభివృద్ధి, సంక్షేమం ఉమ్మడి గమ్యం, లక్ష్యమని అన్నారు. అయిదేళ్లుగా 130 కోట్ల మంది ప్రజలకు సేవ చేసే అదృష్టం తనకు కలిగిందని, వచ్చే ఎన్నికల్లోనూ ఆ అదృష్టం తనకు దక్కుతుందనే ఆత్మస్థైర్యం, సానుకూల దృక్పథం తనకు ఉందని అన్నారు.
తమ హయాంలో ఆర్థికరంగంలో అతివేగంగా పురోగమించిందని, ఉగ్రవాదులకు శరవేగంగా బదులు ఇవ్వగలిగామని మోడీ అన్నారు. యుద్ధ ప్రాతిపదికన పేదరికాన్ని రూపుమాపినట్లు చెప్పారు. దేశాన్ని స్వచ్ఛ భారత్ గా మార్చామని, అవినీతిని పారద్రోలామని చెప్పారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మోడీ వరుస ట్వీట్లు సంధించారు.