కమల వ్యూహం: జమ్మూ కశ్మీర్లో త్వరలో ఎన్నికలు..ఎప్పుడో తెలుసా..?
ఢిల్లీ: అనుకున్నదే జరుగుతోంది. జమ్మూ కశ్మీర్ పై బీజేపీ సర్కార్ పట్టు సాధించాలనే వ్యూహం నిజమయ్యేలా కనిపిస్తోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించి తమ సత్తా చాటాలని భావిస్తోంది.ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఇంతకీ జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి..?
జమ్మూ కశ్మీర్ పై కేంద్రం దృష్టి
జమ్మూ కశ్మీర్ పై ప్రత్యేక దృష్టిసారించింది కేంద్రం. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కమలం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది లేదు. ఇందుకోసం ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తూ వస్తోంది బీజేపీ. ఇప్పటికే ఆ రాష్ట్రం గవర్నర్ పాలనలో ఉండగా... తాజాగా ఎన్నికలు నిర్వహించి తమ సత్తా చాటాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా బీజేపీ కేంద్రమంత్రులు, సీనియర్ నాయకులు తరుచూ పర్యటించారు. పరిస్థితులు చక్కబడ్డాక ఎన్నికలకు వెళదామని భావించారు.
మూడు రాష్ట్రాలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు
జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే నిర్వహించాలని కమలం పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు ముహూర్తం అక్టోబర్గా ఫిక్స్ చేసింది. జమ్మూ కశ్మీర్లో పీడీపీ-బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం పడిపోయాకా 2018 జూన్ 20 నుంచి గవర్నర్ పాలనలో ఉంది. ఆరునెలల పాటు గవర్నర్ పాలన సాగగా ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఆ తర్వాత పీడీపీ కాంగ్రెస్ ఎన్సీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
అమర్నాథ్ యాత్ర తర్వాత ఈసీ ప్రకటన?
ఇదిలా ఉంటే జమ్మూ కశ్మీర్లోని బీజేపీ ముఖ్యనేతలతో ఆ పార్టీ హైకమాండ్ మంగళవారం భేటీ కానుంది. ఈ సమావేశానికి పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ , రవీందర్ రైనాతో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఎన్నికలకు తమ పార్టీ ఏ మేరకు సిద్ధంగా ఉందో చర్చించనుంది. వచ్చే నెల అమరనాథ్ యాత్ర ముగిసిన తర్వాత ఎన్నికల నిర్వహణపై ఈసీ ఒక ప్రకటన చేయనుంది. ఇక జేపీ నడ్డా జమ్మూ కశ్మీర్లో రానున్న రోజుల్లో పర్యటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే జమ్మూ కశ్మీర్లో ఎన్నికల తేదీలను ప్రకటించాలంటూ రామ్మాధవ్ ఈసీని కలిసి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు తమ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉందంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన కూడా చేశారు.