ఓడినా 'ఓటు షేర్'లో ముందున్నారు: ఐదు రాష్ట్రాల్లోనూ ఆసక్తికరం..
19సీట్లతో 22శాతం ఓటు షేర్ ను బీఎస్పీని తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో ఎస్పీ 47సీట్లు సాధించినా.. ఓటు షేర్ విషయంలో మాత్రం బీఎస్పీ కన్నా వెనుకబడిపోయింది. ఆ పార్టీకి కేవలం 21.8శాతం ఓటు షేర్ మాత్రమే దక్క
న్యూఢిల్లీ: దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేలిపోవడంతో.. ఆయా పార్టీల గెలుపోటములపై సమీక్షలు, విశ్లేషణలు మొదలయ్యాయి. పార్టీ పరంగా, కార్యాచరణ పరంగా తప్పొప్పులను బేరీజు వేసుకునే పనిలో పార్టీలు నిమగ్నమైపోయాయి. అదే సమయంలో ఎన్నికల లోగుట్టు తేల్చేందుకు పరిశీలకులు సైతం సిద్దమైపోయారు.
ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన చాలా పార్టీలు సీట్లు సాధించడంలో విఫలమయ్యాయి గానీ ఓటు బ్యాంకుపై మాత్రం పట్టునిలుపుకున్నట్లుగానే తెలుస్తోంది. యూపీ ఎన్నికల ఫలితాల్లోను ఇదే స్పష్టమైంది. 19సీట్లతో బీఎస్పీ(బహుజన్ సమాజ్ వాదీ పార్టీ) మూడో స్థానానికి పరిమితమైనప్పటికీ.. ఓటు షేర్ విషయంలో మాత్రం ఎస్పీ కన్నా మెరుగ్గా ఉండడం విశేషం.
ఎస్పీ కన్నా బీఎస్పీకే ఎక్కువ:
19సీట్లతో 22శాతం ఓటు షేర్ ను బీఎస్పీని తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో ఎస్పీ 47సీట్లు సాధించినా.. ఓటు షేర్ విషయంలో మాత్రం బీఎస్పీ కన్నా వెనుకబడిపోయింది. ఆ పార్టీకి కేవలం 21.8శాతం ఓటు షేర్ మాత్రమే దక్కడం గమనార్హం.
ఇక యూపీలో అట్టర్ ప్లాఫ్ అయిన కాంగ్రెస్ కేవలం 6శాతం ఓటు బ్యాంకుకు మాత్రమే పరిమితమైంది.
పంజాబ్ 'ఓటు షేర్'.. ఆప్ కన్నా అకాలీకే..
పంజాబ్ ఎన్నికల్లో 77 సీట్లతొ అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ 38.5 ఓటు షేర్ సాధించగా.. తొలిసారిగా ఢిల్లీ బయట పోటీ చేసిన ఆప్.. 20సీట్లతో 23శాతం ఓట్లను దక్కించుకుంది. అయితే 15సీట్లను మాత్రమే సాధించిన అకాలీదళ్ ఆప్ కన్నా మెరుగ్గా 25శాతం ఓటు షేర్ సాధించడం విశేషం. ఇక అకాలీదళ్ తో పొత్తు పెట్టుకుని కేవలం 3సీట్లకే పరిమితమైన బీజేపీ పంజాబ్ లో 5శాతం ఓటు షేర్ సాధించింది.
ఉత్తరాఖండ్ 'ఓటు షేర్':
ఉత్తరాఖండ్ లో 70 సీట్లకు గాను 57సీట్లతో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. దీంతో 46.5శాతం ఓటు షేర్ బీజేపీ సొంతం చేసుకుంది. ఇక అధికారాన్ని కోల్పోయి 11సీట్లకు మాత్రమే పరిమితమైన కాంగ్రెస్ 33.5శాతం ఓటు షేర్ సాధించడం విశేషం.
గోవా 'ఓటు షేర్':
గోవాలో 13సీట్లను దక్కించుకున్న బీజేపీ 32.5శాతం ఓటు షేర్ సాధించింది. ఇక 17సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేవలం 28శాతం ఓటు షేర్ సాధించడం గమనార్హం.
మణిపూర్ లో :
మణిపూర్ లో 21సీట్లు దక్కించుకుని మిత్రపక్షాలతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైన బీజేపీ 36శాతం ఓటు షేర్ సాధించడం విశేషం. అదే సమయంలో 28సీట్లు సాధించిన కాంగ్రెస్ 35శాతంకే పరిమితమైపోయింది.