మమతా బెనర్జీ నిర్ణయం: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు ‘జడ్ కేటగిరీ’ భద్రత .. !!
రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు ఉన్న పేరు ఎవరూ కాదనలేనిది. ఇక తాజాగా ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయో ఫలితాలు ఎలా వస్తాయో కూడా ఢిల్లీ ఎన్నికలు చెప్పకనే చెప్పాయి. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయానికి కారణం అయిన పీకే ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లోనూ కేజ్రీవాల్ కోసం పని చేశారు. ఇక ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోసం తన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.
ఎన్నికల వ్యూహకర్తగా పీకేకి గుర్తింపు
పీకే రంగంలోకి దిగారంటే ఆ పార్టీ గెలుపు ఖాయం అనే భావన రాజకీయ వర్గాల్లో తప్పక ఉంటుంది. ఇక ప్రత్యర్థి పార్టీకి పీకే వ్యూహాలు తట్టుకుని నిలబడటం చాలా కష్టం అవుతుంది అనే అభిప్రాయం కూడా ఉంటుంది . వైయస్ జగన్ కు గత ఎన్నికల సమయంలో రాజకీయ వ్యూహ కర్త గా పని చేసిన ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో విజయం సాధించి వైసీపీ పాలనా పగ్గాలు చేపట్టటానికి తెర వెనుక చేసిన కృషి గణనీయమైనది. ఇక ఇటీవల ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ జాబితాలో ఈ దశాబ్దపు రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ చాలా కీలక వ్యక్తి కానున్నారని పేర్కొన్నారు.
పీకే కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత
ఇక అలాంటి ప్రశాంత్ కిషోర్ కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత కల్పించనుందని ఆ రాష్ట్ర సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రశాంత్ కిశోర్ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్న నేపధ్యంలో ఆమె పీకేకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించనున్నారని తెలుస్తుంది. 2019 లోక్సభ ఎన్నికలలో టీఎంసీ ఘోరంగా విఫలమైన తర్వాత, ప్రశాంత్ కిషోర్ ను మమతా బెనర్జీ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంది.
పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కోసం పని చేస్తున్న పీకే
అందుకు తగ్గట్టుగానే బెంగాల్లో గత ఏడాది నవంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో టిఎంసి మొత్తం మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కిషోర్ నియామకం జరిగిన 54 రోజుల తరువాత, గతేడాది జూలై 29 న 'దీదీ కే బోలో'అనే ప్రోగ్రాం ద్వారా దాదాపు ఆరు నెలల వ్యవధిలో,బిజెపికి మారిన ఏడు మునిసిపాలిటీలను తిరిగి స్వాధీనం చేసుకోవడమే కాక, దాని క్షేత్ర స్థాయి నాయకుల విశ్వాసాన్ని కూడా తిరిగి పొందగలిగింది.
ప్రశాంత్ కిషోర్కు ‘జెడ్' కేటగిరీ భద్రత ఎందుకు . ప్రశ్నించిన సిపిఐ (ఎం) నేత
ఇక పీకేకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది. అయితే దీనిని సిపిఐ (ఎం) శాసనసభ పార్టీ నాయకుడు సుజన్ చక్రవర్తి వ్యతిరేకిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రజా జీవితంతో ఎటువంటి సంబంధం లేనప్పటికీ, ప్రశాంత్ కిషోర్కు రాష్ట్ర ప్రభుత్వ వ్యయంతో ‘జెడ్' కేటగిరీ భద్రత ఎందుకు కల్పిస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు .
Recommended Video
బీజేపీపై మమతా, పీకేల పోరాటం
సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా అటు ప్రశాంత్ కిశోర్ సైతం బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. ఒక పక్క మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ లో సిఏఏ అమలు చేయ్యబోమని తేల్చి చెప్తుంది . ఇక వీరిద్దరూ బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవటానికి సిద్ధం అవుతున్న తరుణంలో పీకేకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం .