గుడ్న్యూస్ : ఎలక్ట్రిక్ వెహికిల్స్కు రోడ్ ట్యాక్స్ రద్దు..
ఢిల్లీ : ప్రపంచ దేశాలన్నింటికీ కాలుష్యం అతిపెద్ద సమస్యగా మారిపోయింది. అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత్ తదితర దేశాల్లో పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరింది. వాహనాల కారణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దేశ రాజధానిని సుప్రీంకోర్టు గ్యాస్ ఛాంబర్తో పోల్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాలుష్యానికి చెక్ పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రానున్న ఐదేళ్లలో పొల్యూషన్ ఫ్రీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ మాత్రమే విక్రయించేలా చర్యలు చేపట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల వైపు జనాలను మళ్లించేందుకు కొన్ని ట్యాక్లు ఎత్తివేయాలని నిర్ణయించింది.
రోడ్ ట్యాక్స్ రద్దు
ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను పెంచే ప్రయత్నంలో భాగంగా కేంద్రం వెహికిల్ రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించే రోడ్ ట్యాక్స్ను రద్దు చేసింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై టూ, త్రీ, ఫోర్ వీలర్ కలిగిన ఎలక్రిక్ వాహనాలకు ఎలాంటి రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే కొనుగోలు చేసిన వెహికిల్స్కు రెన్యువల్ ఫీ నుంచి మినహాయింపునిస్తూ ఆ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఐసీ ఇంజిన్ల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్
2030 నుంచి భారత్లో కేవలం ఎలక్ట్రిక్ వెహికిల్స్ మాత్రమే విక్రయించాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో 2023 నుంచి ఐసీ ఇంజిన్లపై క్రమంగా నిషేధం విధించాలని కేంద్రం నిర్ణయించింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల వాహనాలపై నిషేధం విధించనున్న సర్కారు.. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. 2023 నుంచి ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు, 2025 నుంచి 150 సీసీ లోపు ఎలక్ట్రిక్ టూవీలర్స్ మాత్రమే మార్కెట్లోకి అందుబాటులో ఉంచనుంది. ఈ వెహికిల్స్ రాకతో కాలుష్యం గణనీయంగా తగ్గుతుందన్నది కేంద్రం ఆలోచన. దీనికి సంబంధించి కేంద్రం ఆటోమొబైల్ కంపెనీలతో ఇప్పటికే చర్చలు జరుపుతోంది.
తగ్గనున్న ఆయిల్ ఇంపోర్ట్స్
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమలైతే కాలుష్య నియంత్రణతో పాటు ఖజానాపై భారం తగ్గనుంది. ప్రస్తుతం భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో క్రూడాయిల్దే అగ్రస్థానం. ఇందుకోసం ఏటా కొన్ని లక్షల బిలియన్లు ఖర్చు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల రాకతో పెట్రోల్, డీజిల్కు డిమాండ్ తగ్గనుంది. ఫలితంగా క్రూడాయిల్ దిగుమతుల కోసం చేసే వ్యయం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ను జనానికి మరింత చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.