భార్యపై అనుమానం: కొరియర్లో పాములు పార్శిల్
బెంగళూరు: తన భార్యతో చనువుగా ఉన్న అధికారి ప్రాణాలు తియ్యడానికి ఓ వ్యక్తి సరి కొత్త ప్లాన్ వేశాడు. అతనికి కొరియర్ రెండు నాగు పాములు పంపించి చుక్కలు చూపించాడు. ఇక ముందు ఇలానే ఉంటే నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడని అతనికి వార్నింగ్ ఇచ్చాడు.
బెంగళూరు నగరంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేస్ కోర్స్ రోడ్డులో బెంగళూరు ఎలక్ట్రిసిటి సఫై కంపెనీ లిమిటెడ్ (బెస్కాం)లో కెయిత్ డిసిల్వా (48) అనే ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే ఉద్యోగం చేస్తున్న మహిళతో ఆయన చనువుగా ఉంటున్నారని తెలిసింది.
ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త ఈ విషయం జీర్ణించుకోలేకపోయాడు. భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా డిసిల్వాకు బుద్ధి చెప్పాలని ప్లాన్ వేశాడు. అందు కోసం అతను రెండు నాగు పాములు తీసుకుని పార్శిల్ బాక్స్ లో వేశాడు. పాములకు గాలి వెళ్లడానికి కొన్ని రంధ్రాలు పెట్టాడు.
తరువాత కొరియర్ లో ఆ పాములను డిసిల్వాకు పంపించాడు. ఆ బాక్స్ మీద ఓ లేఖ, బాక్స్ లోపల ఓ లేఖ పెట్టాడు. బయట ఉన్న లేఖలో నీవు దూరం నుంచి ఈ బాక్స్ తియ్యాలని, అది నీ మంచికే అని వ్రాసి ఉంది. డిసిల్వా బాక్స్ తీసి చూసే సరికి అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయినంత పని అయ్యింది.
బాక్స్ లోపల రెండు పెద్ద నాగు పాములు దర్శనం ఇచ్చాయి. పాములు బుసలు కొట్టడంతో కార్యాలయం సిబ్బంది హడలిపోయారు. బాక్స్ లో ఉన్న ఉత్తరం తీసి చూడగా నీవు జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది, నా భార్య గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు, ఆలోచించ వద్దు, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని వ్రాసి ఉంది.
ఎప్పటికైనా ప్రాణహాని ఉందని అనుకున్న డిసిల్వా వెంటనే సమీపంలోని హై గ్రౌండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మహిళా ఉద్యోగిని భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. డిసిల్వాతో పాటు కొరియర్ సిబ్బంది ప్రాణాలతో చెలగాటం ఆడారాని పోలీసులు అంటున్నారు.