'లాడెన్లా హఫీజ్ని చంపేయండి', పాక్పై మోడీ సీఎంగా చెప్పారు.. ప్రధానిగా చేశారు
న్యూఢిల్లీ: అయిదేళ్ల క్రితం బిన్ లాడెన్ను అమెరికా ఎలానైతే మట్టుబెట్టిందో, అలాగే హపీజ్ సయీద్ను మట్టుబెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీని యూరీ ఉగ్రదాడిలో మరణించిన అమరజవాన్ హవాల్దార్ అశోక్ కుమార్ సింగ్ భార్య సంగీతా దేవి విజ్ఞప్తి చేశారు.
సంగీతా దేవి తనయుడు, మరో కుటుంబ సభ్యుడు కూడా ఆర్మీలోనే పని చేస్తున్నారు. తీవ్రవాదులందర్నీ తుదముట్టించాలని ఆమె మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఏ భారత సైనికుడి భార్య కూడా తనలా విధవరాలు కాబోరని అన్నారు. సంగీతా దేవిలాగే మరో అమర వీరుడు లాన్స్ నాయక్ సునీల్ విద్యార్థి సతీమణి కూడా చెప్పారు.
తన భర్త ఎలాగు తిరిగి రాడని, తన భర్త మృతి తనకు, తన కుటుంబానికి ఎంతో బాధాకరం అన్నారు. తీవ్రవాదులను కచ్చితంగా కాల్చి వేయాలన్నారు.
పాక్కు బుద్ధి చెప్పేందుకు ఏం చేయాలో ఆనాడే చెప్పిన మోడీ
జమ్మూ కాకశ్మీర్లోని యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దొంగ దెబ్బ తీసి సైనికులను పొట్టనబెట్టుకున్నందుకు భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్తో పాక్కు బుద్ధి చెప్పిందని దేశవ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతోంది. వివిధ దేశాల నుంచి భారత్కు మద్దతు లభించింది. ఈ చర్యతో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
యూరి ఘటనకు కారణమైన వారిని శిక్షించకుండా వదలమని చెప్పిన ప్రధాని మోడీ మాట నిలబెట్టుకున్నారని కితాబిస్తున్నారు. అయితే మోడీ.. పాకిస్థాన్కు ఎలా బుద్ధిచెప్పాలనే అంశాన్ని గతంలోనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అదే ఇప్పుడు చేసి చూపించారు.
2011లో మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆప్ కీ అదాలత్ కార్యక్రమం ద్వారా జర్నలిస్ట్ రజత్ శర్మ ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు మోడీని పాకిస్థాన్ అంశం గురించి ప్రశ్నించారు.
పాకిస్థాన్కు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మోడీ ఆనాడు చెప్పారు. అలాగే పాక్పై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెంచేలా చెయ్యాలన్నారు. మోడీ ప్రధాని అయిన తర్వాత ఇప్పుడు పాక్తో ఉద్రిక్తత నెలకొన్న సమయంలో అదే చేసి చూపించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది.