ఇందిర ఎమర్జెన్సీ తప్పే- అంగీకరించిన రాహుల్- మోడీలా నియంతృత్వం కాదంటూ..
భారత్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్ధితిపై కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తాజాగా మరోసారి స్పందించారు. నానమ్మ ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ తప్పేనని రాహుల్ గాంధీ మరోసారి అంగీకరించారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీ నుంచి ఆర్ధికవేత్త కౌశిక్ బసుతో వర్చువల్ పద్ధతిలో మాట్లాడిన రాహుల్.. పలు కీలక విషయాలను వెల్లడించారు.
నానమ్మ ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ తప్పేనని, ఆ విషయాన్ని ఇందిర కూడా ఒప్పుకున్నారని రాహుల్ చెప్పారు. యూపీఏ హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్కు ఆర్ధిక సలహాదారుగా వ్యవహరించిన కౌశిక్ బసుతో చర్చ సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్ధితులను అప్పటి ఇందిర ఎమర్జెన్సీతో పోల్చలేమన్నారు. ఇప్పుడు బీజేపీ, ఆరెస్సెస్ దేశంలో రాజ్యాంగ వ్యవస్ధలను నాశనం చేస్తున్నాయని అప్పట్లో అలాంటి పరిస్ధితి లేదన్నారు.
ఇందిర ఎమర్జెన్సీకీ, ప్రస్తుత మోడీ పాలనకూ విధానపరమైన తేడా ఉందని, రాజ్యాంగ వ్యవస్ధలను ఆమె ఇలా ఆక్రమించలేదని రాహుల్ స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఆరెస్సెస్ రాజ్యాంగ వ్యవస్ధలను తన చెప్పుచేతల్లో ఉంచుకుంటోందని రాహుల్ మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్ధల్లో ఆరెస్సెస్ తన మనుషులతో నింపేస్తుందన్నారు.
రేపు బీజేపీని తాము ఎన్నికల్లో ఓడించినా వ్యవస్ధల్లో ఉన్న వారి మనుషుల్ని మాత్రం తొలగించలేమన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ, మణిపూర్ లెఫ్టినెంట్ గవర్నర్ నజ్మా హెప్తుల్లాను ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు.