ట్రంప్ ట్రావెల్ బ్యాన్ దెబ్బకు.. ఆ విమానయాన సంస్థ డీలా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎమిరేట్స్ కు బుకింగ్స్ కరువయ్యాయి. ఒరిజినల్ ట్రావెల్ బ్యాన్ అనంతరం ఈ సంస్థ బుకింగ్స్ 35 శాతం పడిపోయాయి.
బెర్లిన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎమిరేట్స్ కు బుకింగ్స్ కరువయ్యాయి. ట్రంప్ విధించిన ఒరిజినల్ ట్రావెల్ బ్యాన్ అనంతరం తమ బుకింగ్స్ 35 శాతం పడిపోయాయని ఎమిరేట్స్ విమానయాన సంస్థ అధ్యక్షుడు టిక్ క్లార్క్ తెలిపారు.
జనవరి నెలలో ట్రంప్ ఏడు ముస్లిం దేశాలకు చెందిన ప్రయాణికులకు అమెరికాలో ప్రవేశించడాన్ని నిషేధించిన విషయం విదితమే. అనంతరం ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకారులు విమానాశ్రయాల వద్ద ఆందోళనలు చేపట్టారు.
అనంతరం మళ్లీ ట్రావెల్ బ్యాన్ పై కొత్త ఆర్డర్లను ట్రంప్ జారీ చేశారు. ఈసారి ఆరు దేశాలపైనే వేటు వేసి, గ్రీన్ కార్డు హోల్డర్లకు ఈ బ్యాన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన వెంటనే ఈ ప్రభావం తమ సంస్థపై పడిందని క్లార్క్ చెప్పారు.
గత నెలలో భారతీయుడిపై కాన్సస్ లో జరిగిన విద్వేషపూరిత దాడి కూడా తమ ఎయిర్ లైన్స్ కు దెబ్బ కొట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బుకింగ్స్ రికవరీ అవుతున్నాయని, కానీ ఆశించిన స్థాయిలో మాత్రం లేవన్నారు. యథాతథ స్థితికి వస్తాయో లేదో కూడా అనుమానమే అని క్లార్క్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ట్రావెల్ బ్యాన్ విధించిన తొలి ఎనిమిది రోజుల్లోనే అమెరికాకు వెళ్లే ప్రయాణికుల శాతం కూడా 6.5 శాతం తగ్గినట్లు ట్రావెల్ కన్సల్టెంట్ ఫార్వర్డ్ కీస్ సోమవారం నివేదికలో పేర్కొంది.
నిషేధ దేశాల ప్రయాణికులను, అమెరికాను కలుపుతూ ప్రయాణించే ప్రధాన విమాన సంస్థ ఎమిరేట్సే. దుబాయ్ హబ్ ద్వారా ఇది ప్రయాణిస్తోంది. నిషేధ దేశాలకు, అమెరికాకు ప్రస్తుతం నేరుగా ఎలాంటి విమానాలు లేవు.