పుల్వామా ఉగ్రదాడి : కన్నీటిని దిగమింగి.. కన్నతండ్రికి సెల్యూట్
డెహ్రాడూన్ : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్లకు దేశమంతా నివాళులు అర్పిస్తోంది. ఈ క్రమంలో జవాన్ల స్వస్థలాల్లో విషాదఛాయలు అలముకుంటున్నాయి. ముష్కరుల దొంగ దెబ్బతో అమరులైన జవాన్లకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. జవాన్ల పార్థివ దేహాలు క్రమక్రమంగా వారి స్వస్థలాలకు చేరుతున్నాయి. ఉగ్రదాడిలో మరణించిన జవాన్లకు అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ ప్రజలు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
గ్రేట్ డాడీ.. సెల్యూట్ నాన్న
డెహ్రాడూన్ ప్రాంతానికి చెందిన సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ మోహన్లాల్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన పార్థివ దేహం స్వస్థలానికి చేరుకుంది. డెడ్ బాడీ చూడగానే కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. వారిని ఆపడం ఎవరివల్ల కాలేదు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సహా ఆయా పార్టీల నేతలు, అధికారులు నివాళులు అర్పించారు. తండ్రి పార్థివ దేహాన్ని చివరిసారిగా చూసిన మోహన్లాల్ కుమార్తె గంగ సెల్యూట్ చేసింది. తండ్రి ఇకలేరన్న బాధను పంటి బిగువున దిగమింగుకుని ఆ అమ్మాయి సెల్యూట్ చేసిన హృదయ విదారక ఘటన అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.
నివాళి...
బీహార్ ప్రాంతానికి చెందన సీఆర్పీఎఫ్ జవాన్లు సంజయ్ కుమార్, రతన్ కుమార్ పార్థివ దేహాల స్వస్థలానికి చేరుకున్నాయి. బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో పాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తదితరులు నివాళులు అర్పించారు. ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ ప్రాంతానికి చెందిన జవాన్ ప్రదీప్ పార్థివ దేహం కూడా ఆయన స్వస్థలానికి చేరుకుంది. ప్రదీప్ అంత్యక్రియలకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అంతకుముందు నిర్వహించిన అంతిమ యాత్రలో పాల్గొని ఆ వీర జవానుకు కన్నీటి వీడ్కోలు పలికారు.
వీ ఆర్ విత్ యూ
ఉగ్రవాదుల దొంగ దెబ్బకు ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్లకు దేశవ్యాప్తంగా కన్నీటి నివాళులు అర్పిస్తోంది. ఎక్కడ చూసినా అమరజవాన్లకు మద్దతుగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లో సైతం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ.. అమరవీరులకు సంతాపం ప్రకటిస్తున్నారు. సైనికులకు అండగా ఉంటామంటూ సంఘీభావం తెలుపుతున్నారు.