కంపెనీలో చోరీ, ఆందోళనతో ఉద్యోగి ఆత్మహత్య, నన్ను టార్చర్ చేస్తున్నారని డైరీలో !
మైసూరు/బెంగళూరు: ఉద్యోగం చేస్తున్న కంపెనీలో చోరీ జరగడంతో ఆ నింద తన మీదకు ఎక్కడ వస్తుందో అనే ఆందోళనతో ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలోని సాంసృతిక నగరి మైసూరులో జరిగింది. తనను ఎక్కువగా వేధింపులకు గురి చేస్తున్నారని, టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ ఉద్యోగి డైరీలో రాసుకున్నారు.
మైసూరు నగరం సమీపంలోని మేటగళ్లిలో స్పెక్ట్రా పైప్స్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో హరీష్ కుమార్ (42) ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజుల క్రితం ఈ కంపెనీలో రూ. లక్షల విలువైన వస్తువులు చోరీ అయ్యాయి. చోరీ అయిన విషయం గుర్తించిన హరీష్ కుమార్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్టైక్ట్రా పైప్స్ కంపెనీలో ఎవరు చోరీ చేశారు అంటూ మేటగళ్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సమయంలో పోలీసులు ఎక్కడ తనను విచారణ చేస్తారో, నా కుటుంబ సభ్యులకు ఏమైనా సమస్యలు వస్తాయో అంటూ హరీష్ కుమార్ ఆందోళన చెందాడు.
పోలీసులకు భయపడిన హరీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కంపెనీ నిర్వహకుల వేధింపుల కారణంగా హరీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న కంపెనీ యజమాని అనిల్ మెహ్రా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
హరీష్ కుమార్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు కంపెనీ నిర్వహకులు వేధింపులకు గురి చేశారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసి ఉందని వెలుగు చూసింది. డైరీ స్వాధీనం చేసుకుని చోరీ కేసులో హరీష్ కుమార్ కు ఏమైనా సంబంధం ఉందా ? అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.