ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు?
ఢిల్లీ : ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రజలను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. మాకు అధికారం ఇవ్వండి మీ కోసం అది చేస్తాం ఇది చేస్తామని మభ్యపెడుతున్నాయి. అయితే ఎన్నికల సమయంలో ఓటర్లకు కనిపించే నాయకులు ఆ తంతు ముగియగానే పత్తాలేకుండా పోతారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తారు. నాయకులు హామీలు తామరాకుపై నీటి బొట్టు చందంగా ఎందుకు మారుతున్నాయి? ప్రజలు అడుగుతున్నవి గొంతెమ్మ కోరికలా? వాటిని తీర్చడం నాయకులకు తలకు మించిన భారమా? ఇంతకీ జనం ఏం అడుగుతున్నారు?
దేశవ్యాప్తంగా ఏడీఆర్ సర్వే
ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వాల నుంచి ప్రజలు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని మాత్రమే కోరుకుంటున్నారు. మెరుగైన ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సేవలు, తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు అందిస్తేచాలని అంటున్నారు. దేశంలో అతిపెద్ద ఓటర్ సర్వే సంస్థ అయిన అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్..ఏడీఆర్ 2018లో నిర్వహించిన సర్వేలో ఇదే విషయం తేలింది. గతేడాది అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో దేశంలోని 534 లోక్సభ నియోజకవర్గాల్లోని 2,73,487 మంది ఓటర్లపై సర్వే నిర్వహించారు.
ఉద్యోగం, ఆరోగ్యం, నీళ్లకే ప్రాధాన్యం
ఏడీఆర్ మొత్తం 31 అంశాలపై సర్వే నిర్వహించగా.. ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య సంరక్షణ, తాగునీరు అంశాలే తమ ప్రాధామ్యాలని ఓటర్లు తేల్చిచెప్పారు. ఉపాధి అవకాశాల కల్పన విషయంలో 2017తో పోలిస్తే 2018లో ప్రభుత్వ పనితీరు అధ్వానంగా మారింది. 5 పాయింట్ల స్కేలుపై రేటింగ్ 3.17 నుంచి 2.15కు పడిపోయింది. ఇక మౌలిక సదుపాయాల విషయంలోనూ ప్రజలు ప్రభుత్వాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏడీఆర్ సర్వేలో ఓటర్ల చెప్పిన పది ప్రాధాన్యాంశాల్లో 46.8శాతం వాటాతో మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన అంశం టాప్ ప్లేస్లో ఉంది. 34.60శాతం మంది ఆరోగ్య సంరక్షణ, 30.50శాతం మంది తాగునీరు అందించాలని కోరుకుంటున్నారు. 28.34శాతం మంది మెరుగైన రహదారులు, 27.35శాతం ఓటర్లు ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని అంటున్నారు.
పదిలో నాలుగు వ్యవసాయ సమస్యలు
ఏడీఆర్ సర్వేలో వ్యవసాయానికి సంబంధించి నాలుగు సమస్యలు తొలి పదిస్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. వ్యవసాయానికి అవసరమైన సాగునీరు అందించాలని 26.40శాతం మంది కోరుకుంటుండగా.. 25.62శాతం మంది వ్యవసాయ రుణాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అటున్నారు. ఇక 25.41శాతం మంది వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర , 25.06శాతం మంది విత్తనాలు, ఎరువుల సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు. ఏడీఆర్ సర్వే లిస్టులో 23.95శాతంతో శాంతిభద్రతలకు పదోస్థానం దక్కింది.
కనీస ఆదాయం పథకం అమలు చేయొచ్చు ..కండీషన్స్ అప్లై: రఘురాంరాజన్
సగటుకన్నా తక్కువ రేటింగ్
ఓటర్ల ప్రాధాన్యతాంశాల్లో ప్రభుత్వానికి సగటుకన్నా తక్కువ రేటింగ్ దక్కింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలుపుకుని ఏడీఆర్ మొత్తం 32 చోట్ల సర్వే నిర్వహించగా.. 29 చోట్ల గవర్నమెంటుకు బిలో యావరేజ్ మార్కులే వచ్చాయి.