జమ్మూకాశ్మీర్లో మళ్లీ ఎన్ కౌంటర్లు.. సోషల్ సైట్లపై నిషేధం ఎత్తివేత.. ఇద్దరికి కరోనా లక్షణాలు
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ లో మరోసారి తుపాకులు గర్జించాయి. బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు, ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో బుద్గాం జిల్లా కేంద్రం, బారాముల్లా జిల్లా సోపూర్ లో సెక్యూరిటీ బలగాలు గాలింపు చేపట్టాయి. సోపూర్ ఘటనలో పోలీసులు, పౌరులపై కాల్పు జరిపిన ఉగ్రవాదిని బలగాలు చుట్టుముట్టాయి. ఇదిలా ఉంటే,
జమ్మూకాశ్మీర్ లో దాదాపు ఏడు నెలల తర్వాత సోషల్ మీడియా సైట్లపై నిషేధాన్ని ఎత్తేశారు. కొద్ది రోజుల కిందటే 2జీ నెట్ వర్కులపై నియంత్రణ తొలగించిన సంగతి తెలిసిందే. అయితే నిషేధం ఎత్తవేత పేరుకే జరిగిందని, ఎయిర్ టెల్ లో కొద్దోగొప్పో తప్ప మిగతా సర్వీసులేవీ పనిచేయడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. మరోవైపు యూటీలో కరోనా భయాలు కూడా పెరుగుతున్నాయి..
ఇటీవలే సౌత్ కొరియా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో వారిని జమ్మూలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి, ఐసోలేషన్ వార్డులో ఉంచారు. పరీక్షల కోసం శాంపిల్స్ ను ఢిల్లీకి పంపామని డాక్టర్లు చెప్పారు. కరోనా వ్యాప్తి తర్వాత బాధిత దేశాలకు వెళ్లొచ్చిన మరో 200 మందిని కూడా గుర్తించామని, వాళ్లందరికీ టెస్టులు చేయిస్తామని అధికారులు తెలిపారు.