కాశ్మీర్ లో ఎన్ కౌంటర్: పాక్ ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని సోషియన్ జిల్లాలో శనివారం భారత భద్రతా దళాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. భారత జవానుకు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
భారత జవాను పరిస్థితి నిలకడగా ఉందని ఆర్మీ అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి సోసియన్ పట్టణం సమీపంలోని బోద్ జాన్ గ్రామంలో ఉగ్రవాదులు భారత జవాన్ల మీద కాల్పులు జరిపి చాకచక్యంగా చీకటిలో పారిపోయారు.
అప్రమత్తం అయిన సైన్యం స్థానిక పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టింది. సమీపంలోని ఓ ఇంటిలో ఉగ్రవాదులు తల దాచుకున్నారని పసిగట్టారు. వెంటనే లొంగిపోవాలని ఉగ్రవాదులను హెచ్చరించారు.
అయితే ఉగ్రవాదులు పోలీసులు, సైన్యం మీద కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. ఇంటిలో ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నారని ఆర్మీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.