16 ఏళ్లకే ఎన్కౌంటర్.. 12 పాస్ అయిన 10 రోజులకే... హత్యే అంటున్న తల్లి...
కాన్పూర్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబేని పట్టుకునే క్రమంలో అతని అనుచరుల్లో ఐదుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఐదుగురిలో ఒకరైన ప్రభాత్ మిశ్రా అలియాస్ కార్తికేయ్కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెర పైకి వచ్చాయి. తన కుమారుడు అమాయకుడని చెప్పిన ప్రభాత్ మిశ్రా తల్లి... అతను ఎయిర్ఫోర్స్లో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కన్నట్లు తెలిపారు. ఎన్కౌంటర్లో చనిపోవడానికి 10 రోజుల ముందు,జూన్ 29న ప్రకటించిన 12వ తరగతి పరీక్షల్లో అతను 61శాతంతో ఉత్తీర్ణుడైనట్లు చెప్పారు. ఇంకా స్కూల్ నుంచి మెమో కూడా అందుకోలేదని... ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని వాపోయారు.
మిశ్రా తల్లి ఏమంటున్నారు...
బిక్రూలో 8 మంది పోలీసులను దూబే గ్యాంగ్ పొట్టనబెట్టుకున్న ఘటన తర్వాత.. తన కుమారుడు ప్రభాత్ మిశ్రాను కాన్పూర్ వదిలి వెళ్లాల్సిందిగా చెప్పినట్లు అతని తల్లి గీత పేర్కొన్నారు. ఆ తర్వాతి రోజు రాత్రి పోలీసులు తమ ఇంటికొచ్చి తన సెల్ఫోన్ తీసుకెళ్లినట్లు చెప్పారు. మిశ్రా ఫోన్ నంబర్ తనకు నోటికి గుర్తు లేనందువల్ల ఆ తర్వాత నుంచి అతనితో కమ్యూనికేషన్ లేకుండా పోయిందన్నారు. జూలై 9న మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసిందని పేర్కొంది.
అది హత్యేనని ఆరోపించిన తల్లి...
మిశ్రాను అరెస్ట్ చేసిన సమయంలో అతనితో పాటు మరో ఇద్దరున్నారని పోలీసులు చెప్పారని... ఆ ఇద్దరూ ఎవరో తమకు తెలియదని గీత చెప్పారు. మిశ్రా పట్టుబడిన ఫరీదాబాద్లో తమకు బంధవులు కూడా లేరన్నారు. అరెస్ట్ గురించి తెలిసిన కొద్ది గంటలకే టీవీల్లో ఎన్కౌంటర్ వార్త చూశామని చెప్పారు. అది ఎన్కౌంటర్ కాదని... హత్య అని ఆరోపించారు. అంతకుముందు,జూలై 3న తమ ఇంటి టెర్రస్పై కాల్పుల శబ్దం వినిపించిందని పోలీసులు తనతో చెప్పారని... కానీ అందులో నిజం లేదని అన్నారు.
వయసు 16 ఏళ్లే...
కొడుకు ఎన్కౌంటర్లో చనిపోయినప్పటి నుంచి ప్రాణ భయంతో తన భర్త కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని గీత తెలిపారు. మిశ్రా ప్రతిభావంతుడైన విద్యార్థి అని... పదో తరగతిలో 78శాతం మార్కులు,ఇంటర్లో 61శాతం మార్కులు వచ్చాయని తెలిపారు. ఇంటర్మీడియట్ తర్వాత ఎయిర్ఫోర్స్లో చేరాలని అతను కలలు కన్నట్లు చెప్పారు. అతని ఆధార్ కార్డును,మార్కుల షీట్ను మీడియాకు చూపించారు. వాటి ప్రకారం.. ఎన్కౌంటర్లో మిశ్రా చనిపోయే నాటికి అతని వయసు 16 ఏళ్లు మాత్రమే.
పోలీసుల వెర్షన్...
కాన్పూర్ ఇన్స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. మిశ్రా వయసుకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు. జూలై 8న హర్యానా పోలీసులు అతని వద్ద రెండు గన్స్ను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.బిక్రూలో దూబే గ్యాంగ్ 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న ఘటనలో ఆ రెండు గన్స్ని ఉపయోగించినట్లుగా గుర్తించామని తెలిపారు. వికాస్ దూబే యువకులను ఆకర్షించి తన గ్యాంగ్లో చేర్చుకునేవాడని.. ఆ క్రమంలో మిశ్రా కూడా అతని గ్యాంగ్లో చేరాడని తెలిపారు.
మిశ్రా వయసు 19 అంటున్న పోలీసులు...
ఫరీదాబాద్ పోలీసులు మాట్లాడుతూ... మిశ్రా వయసు 19 ఏళ్లు అని పేర్కొనడం గమనార్హం. జూలై 9న ఫరీదాబాద్లో పట్టుబడ్డ అతన్ని కాన్పూర్కి తరలిస్తుండగా... మార్గమధ్యలో ఆ వాహనం టైర్ పంక్చర్ అయిందని చెప్పారు. అదే అదనుగా భావించి మిశ్రా సబ్ఇన్స్పెక్టర్ గన్ లాక్కుని పరిగెత్తాడని.. పోలీసులపై కాల్పులు జరిపాడన్నారు. ఆత్మరక్షణలో భాగంగా తాము కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని... ఆ కాల్పుల్లో అతను చనిపోయాడని చెప్పారు.