మే 4: విమాన సేవలను ప్రారంభించనున్న ఇండిగో, ఆ తేదీలోగా బుకింగ్స్ రద్దు చేస్తే డబ్బు వాపస్
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం రెండోసారి విధించిన లాక్డౌన్ మే 3తో ముగస్తుండటం దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ కీలక నిర్ణయం ప్రకటించింది. మే 4వ తేదీ నుంచి తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపింది. కరోనాపై ప్రభుత్వం పోరాడుతున్న తీరును ప్రశంసించింది.
'మే 3వ తేదీన లాక్డౌన్ ముగిసిన అనంతరం మే 4 నుంచి స్వదేశంలో మాత్రమే విమానయాన కార్యకలాపాలను ప్రారంభిస్తాం. తర్వాత దశలవారీగా కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో నడుపుతాం. క్రమంగా మా సేవలను విస్తరిస్తాం' అని ఇండిగో సీఈఓ రోనోజాయ్ దత్త ఓ ప్రకటనలో వెల్లడించారు. రానున్న కాలంలో తమ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపారు.
తమ మొదటి ప్రాధాన్యం తమ వినియోగదారులు, ఉద్యోగుల ఆరోగ్యమేనని స్పష్టం చేశారు. మే 03 వరకు వినియోగదారులు రద్దు చేసుకోవచ్చని, బుకింగ్ మొత్తం తిరిగి చెల్లించడం జరుగుతుందని తెలిపారు.
పేద ప్రజలకు ఉచితంగా పరీక్షలు చేయండి: సుప్రీం
కరోనావైరస్ పరీక్షలు కేవలం పేదలకు మాత్రమే ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసింది. పేదలతోపాటు ఎవరెవరికి పరీక్షలు ఉచితంగా నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వమే తీసుకోవాలని సూచించింది. కరోనా నిర్ధారణ పరీక్షలు అందరికీ ఉచితంగా చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.
కాగా, ప్రైవేట్ ల్యాబోరేటరీస్ ఉచితంగా చేయలేమని చెప్పడంతో తాజాగా సుప్రీంకోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది. ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులైన వారికి, ప్రభుత్వం గుర్తించిన ఆర్థిక బలహీన వర్గాలకు ఉచిత పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారితోపాటు తక్కువ ఆదాయం పొందే కార్మికులకు, ఇతర వర్గాల ప్రజలకు కూడా ఉచితంగా పరీక్షలు చేసే విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. వారంలో రోజుల్లోగా నిర్ణయాన్ని తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.