రాష్ట్రాలకు బేషరతుగా రూ.2.16 లక్షల కోట్లు - జీఎస్టీ పరిహారం ప్రతిష్టంభనకు తెర: నిర్మలా సీతారామన్
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) పరిహారం కింద రాష్ట్రాలకు ఆదాయ లోటును పూడ్చటం తమ వల్ల కాదంటూ దాదాపు చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు ఒత్తిడి పెంచడంతో ఎట్టకేలకు దిగొచ్చింది. జీఎస్టీ పరిహార ప్రతిష్టంభనను పరిష్కరించే దిశగా రాష్ట్రాల తరఫున కేంద్రమే అప్పు చేస్తుందని గురువారం ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. వనరుల సంక్షోభాల నుంచి బయటపడేలా ఈ ఏడాదిలోపే రాష్ట్రాలకు రూ .2.16 లక్షల కోట్ల నిధులను బేషరతుగా అందుబాటులోకి తెస్తామని ఆమె భరోసా ఇచ్చారు.
జడ్జిలపై ఫిర్యాదు: జగన్కు షాక్ - సీజేఐకి బీజేపీ నేత అశ్విని లేఖ - ఏపీ హైకోర్టు మాజీ జడ్జి అలీ కూడా
అనుమానాలు తీర్చకుండానే..
జీఎస్టీ కింద రాష్ట్రాలకు ఆదాయలోటును పూడ్చేందుకు.. రూ.1.1 లక్షల కోట్లను రాష్ట్రాల తరఫున కేంద్ర ప్రభుత్వమే రుణం కింద సమీకరించి వాటికి సర్దుబాటు చేస్తుందని మంత్రి నిర్మలా గురువారం ప్రకటించడం తెలిసిందే. ఈ రూ.1.1లక్షల కోట్ల రుణాన్ని పలు విడతల్లో తీసుకుని, రాష్ట్రాలకు సర్దుబాటు చేస్తామన్న ఆమె.. సదరు అప్పుకు వడ్డీ, అసలు చెల్లింపులు ఎవరు చేస్తారన్న విషయాన్ని మాత్రాం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ అనుమానాల జోలికి వెళ్లకుండానే శుక్రవారం నిర్మలా రాష్ట్రాలకు రాసిన లేఖలో అదనపు రుణం గురించి కూడా ప్రస్తావించారు.
రెండు ఆప్షన్లతో రూ.2.16లక్షల కోట్లు..
‘‘జీఎస్టీ కింద రాష్ట్రాలు ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు ప్రత్యేక విండో ద్వారా రూ.1.1 లక్షల కోట్ల రుణ సమీకరణను కేంద్రం చేపడుతుంది. ఇది కాకుండా, మరో మార్గంలో.. అంటే, ఈ ఏడాది మే17న కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో సడలింపులు కల్పించడం ద్వారా.. రాష్ట్రాలు కొత్తగా ఎలాంటి సంస్కరణలు చేయకుండానే తమ జీఎస్డీపీలో 0.5 శాతానికి సమానమైన మొత్తన్ని రుణంగా పొందే వీలుంటుంది. ఈ రెండు ఆప్షన్ల కింద మొత్తం రూ .2.16 లక్షల కోట్ల రుణం రాష్ట్రాలకు బేషరతుగా లభిస్తుంది'' అని నిర్మల తన లేఖలో పేర్కొన్నారు.
ఇంతటితో ప్రతిష్టంభన ముగిసినట్లేనా?
ఆర్థిక వ్యవస్థ మందగమనానికితోడు కరోనా వైరస్ లాక్ డౌన్ తోడు కావడంతో ప్రతికూల పరిస్థితులు తలెత్తి జీఎస్టీ వసూళ్లు భారీగా క్షీణించడం తెలిసిందే. గతంలో రాష్ట్రాలు తమ లోటును పూడ్చుకునేందుకు వ్యాట్, స్థానిక పన్నులను పెంచేవి, జీఎస్టీ తరువాత ఆ అవకాశం లేకపోవడంతో వసూళ్లలో క్షీణత ప్రభావం రాష్ట్రాల బడ్జెట్లపై పడింది. రాష్ట్రాల లోటును కేంద్రమే పూడ్చుతుందని జీఎస్టీ చట్టంలో ఉండటంతో ఆమేరకు పరిహారం ఇవ్వాలంటూ రాష్ట్రాలు ఒత్తిడి పెంచాయి. దాదాపు నాలుగు నెలల ప్రతిష్టంభన తరువాత దీనికి తెర దించుతూ రాష్ట్రాల తరఫున కేంద్రమే అప్పు చేసి, పరిహారం చెల్లిస్తుందని నిర్మల ప్రకటించారు. రాష్ట్రాల తరఫున కేంద్ర ప్రభుత్వం రుణాలు తీసుకోవడం వల్ల ఒకటే వడ్డీ రేటు ఉంటుందన్న ఆమె.. వాటిని తిరిగి చెల్లించే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోననే ఉత్కంఠ కొనసాగుతున్నది.
Recommended Video
మళ్లీ ఆర్టికల్ 370: కాశ్మీర్లో కొత్త కూటమి - అబ్దుల్లా-ముఫ్తీ- కాంగ్రెస్ ఉమ్మడి పోరు - రోడ్ మ్యాప్