నీరవ్ పాస్పోర్టులు రద్దు చేయండి: ఈడీ, పట్టుకునేందుకు సాయం చేయాలని ఆ దేశాలకు లేఖ
ముంబై: నీరవ్ మోడీ పాస్పోర్టులను రద్దు చేయాలని ముంబై పాస్పోర్టు కార్యాలయాన్ని ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం కోరింది. నీరవ్ మొత్తం ఆరు పాస్పోర్టులు కలిగి ఉన్నాడు. ఆరు పాస్పోర్టులను రద్దు చేయాలని ముంబై కార్యాలయానికి సూచించింది. అతని పేరిట మొత్తం ఆరు పాస్పోర్టులను గుర్తించింది. ఇప్పటికే ఓ పాస్ పోర్టును రద్దు చేశారు. మిగతా ఐదింటిని రద్దు చేయాలని చెప్పింది.
మరోవైపు, నీరవ్ మోడీ యూరోపియన్ దేశాలలో ఉన్నాడని తెలియడంతో ఆ దేశాలకు కేంద్ర విదేశాంగ శాఖ లేఖ రాసింది. నీరవ్ మోడీ ఎక్కడున్నాడో గుర్తించడంలో తమకు సహకరించాలని కోరారు.
పదమూడు వేల కోట్ల మేర బ్యాంకింగ్ మోసానికి పాల్పడి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని స్వదేశానికి రప్పించేందుకు అనుమతివ్వాలన్న ఈడీ విజ్ఞప్తికి ముంబైలోని ప్రత్యేక కోర్టు కూడా అంగీకరించింది.
అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నీరవ్పై దాఖలైన ఛార్జీషీట్ల ఆధారంగా బ్రిటన్, బెల్జియం సహా ఇతర దేశాల్లో వెతికేందుకు అనుమతి కోరుతూ ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
నీరవ్ అప్పగింతకు సంబంధించి భారత్కు పూర్తిగా సహకరిస్తామని బెల్జియం హామీ ఇచ్చింది. ఇరుదేశాల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం కుదుర్చుకుని చాలా కాలమైనా అందుకు కట్టుబడి ఉంటామని భారత్లోని బెల్జియం రాయబారి తెలిపారు.