కోడ్ ఉల్లంఘన కేసులో మోడీకి షాక్! పిటీషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్ట్!
ఢిల్లీ : ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో బీజేపీతో పాటు ఎలక్షన్ కమిషన్కు షాక్ తగిలింది. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు సత్వర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మంగళవారం నుంచి విచారణ ప్రారంభిస్తామని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టుపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను... రాఫెల్ కేసులో మాత్రం సారీ చెప్పను: రాహుల్
మోడీ, అమిత్ షాపై ఫిర్యాదు
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు అమిత్ షా పలుమార్లు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మోడీ, అమిత్ షాల విషయంలో ఎలక్షన్ కమిషన్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై త్వరితగతిన విచారణ జరపాలని అభ్యర్థించారు. ఆమె పిటీషన్ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన ధర్మాసనం మంగళవారం నుంచి వాదనలు వింటామని ప్రకటించింది.
ఈసీ ఆదేశాలు బేఖాతరు
ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడి, అనంతరం జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అంశాలను ప్రచారంలో ఉపయోగించరాదని ఎలక్షన్ కమిషన్ అన్ని రాజకీయాలకు ఆదేశించింది. అయితే వాటిని లెక్కచేయని మోడీ, అమిత్ షా తమ ఎన్నికల ప్రచారంలో పదే పదే ఈ అంశాలను ప్రస్తావించారు. అంతేకాక విద్వేషాలు రెచ్చగొట్టేలా వారి ప్రసంగాలు సాగాయని ఇలా వారు 8సార్లు ఎన్నికల నియమావళిని అతిక్రమించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
చర్యలు తీసుకునేలా ఈసీని ఆదేశించండి
ఏప్రిల్ 23న గుజరాత్లో ఓటు వేసిన అనంతరం మోడీ రోడ్ షో తరహా ర్యాలీ నిర్వహించి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని పిటీషనర్ ఆరోపించారు. ఇలాంటి కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి. అయితే మోడీ, అమిత్ షా విషయంలో ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని పిటీషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. వారిపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.