ఇంగ్లీషు బుద్ది ఒక వ్యాధి..ఇంగ్లీషు భాష కాదు: వెంకయ్య నాయుడు
గోవా: ఇంగ్లీషు బుద్ధి కలిగి ఉండటం ఒక రోగం తప్ప ఇంగ్లీషు భాష కాదని అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భారత్ యొక్క ఘనమైన చరిత్ర సంస్కృతి పట్ల ప్రతి ఒక్కరం గర్వపడాలని ఆయన అన్నారు. ఈ నెల మొదట్లో ఇంగ్లీషు పై వెంకయ్య చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిన నేపథ్యంలో ఆయన ఇంగ్లీషు భాషపై మాట్లాడారు. బ్రిటీషు వారు వెళుతూ వెళుతూ ఇంగ్లీషు అనే వ్యాధిని ఇక్కడే వదిలేసి పోయారని వ్యాఖ్యానించినట్లు మీడియా పేర్కొంది. మన మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరంపై తాను మాట్లాడిన సమయంలో ఒక వర్గం మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని అన్నారు. ఇంగ్లీషు ఒక వ్యాధి అని తాను అన్నట్లుగా మీడియా రాసిందని అయితే ఇంగ్లీషు బుద్ధి ఒక వ్యాధి అని ఇంగ్లీషు భాష కాదని తాను చెప్పినట్లు వెంకయ్య స్పష్టం చేశారు.
గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బ్రిటీషు వారు దేశాన్ని విడిచి వెళ్లారని కానీ వారే గొప్పవారుగా కీర్తించబడాలనే ఒక భావనను ఇక్కడ వదిలి వెళ్లిపోయారని...భారతీయులుగా మనం ఏమీకాదనే భావన కలిగించి వెళ్లారని వెంకయ్య అన్నారు. ఈ భావన నుంచి మనం బయటకు రావాలని చెప్పిన వెంకయ్యనాయుడు... మన చరిత్ర మన సంస్కృతి మన నేతల పట్ల ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాలని చెప్పారు. అంతేకాదు భారత్ ఎవరిపై దండెత్తలేదని... భారత్ పైనే కొందరు దాడి చేశారని గుర్తుచేశారు. భారత్పైకి దండెత్తిన వారు మనలను పాలించడమే కాదు... మన ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టారు. అంతేకాదు వారు మానసికంగా కూడా నలగొట్టారని వెంకయ్య చెప్పారు. అందుకే ప్రజలు ఇంకా ఆ మానసిక వేదనతో బాధపడుతున్నారని వెల్లడించారు.
భారతీయులు బ్రిటీషు వారు కలిగించిన భావన నుంచి బయటకు రావాలని తిరిగి మూలాలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఎక్కడికెళ్లినా సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పిన వెంకయ్య ఇందుకు బాధ్యతతో కూడిన పనుల చేస్తే దేశం మనలను గుర్తుపెట్టుకుంటుందన్నారు. అంతేకాదు దేశ సంస్కృతిని పరిరక్షించడంతో పాటు ప్రకృతిని కూడా కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు వెంకయ్యనాయుడు. అంతేకాదు రాజ్యసభ ఛైర్మెన్గా కొన్ని మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పిన వెంకయ్య... ఎవరైనా మంత్రులు ఏదైనా పేపర్లు సబ్మిట్ చేయాలంటే... "ఐ బెగ్ టూ మూవ్" అంటారని అయితే ఎవరినీ అడుక్కోవాల్సిన పరిస్థితి ఇక్కడ లేదని "ఐ సబ్మిట్ ది పేపర్ " అని చెబితే సరిపోతుందని చెప్పిన్నట్లు వెంకయ్య చెప్పారు. అంతేకాదు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్ నూన్, గుడ్ ఈవినింగ్లు అవి మంచిగా ఉన్నా లేకున్నా చెబుతామని... నమస్కారం చెబితే బాగుంటుందని నమస్కారం మన సంస్కారంను తెలియజేస్తుందన్నారు వెంకయ్య. కుటుంబ సభ్యులు అందరూ కూడా మాతృభాషలో మాట్లాడాలన్నారు వెంకయ్య. మనకు చాలా భాషలున్నాయన్న వెంకయ్య ఆ భాషలను గౌరవిద్దాం అని అన్నారు.
పర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదన్న వెంకయ్య ఎన్ని భాషలు కావాలంటే అన్ని నేర్చుకోండి అని అన్నారు. పోర్చుగీస్, చైనీస్, రష్యన్, ఇలా నేర్చుకోవడంలో తప్పులేదన్నారు. కానీ మన చర్చలు డిబేట్లు మాత్రం మాతృభాషలోనే చేద్దామన్నారు. ఇప్పటి వరకు రాజ్యసభలో 22 భాషలు మాట్లాడేందుకు తాను అనుమతించినట్లు చెప్పిన వెంకయ్య ఇందులో గోవాకు చెందిన కొంకని భాష కూడా ఉందని తెలిపారు.